హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల.. రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్దకు చేరుకునేంత వరకు ఎక్కడెక్కడి వెళ్లారు, ఎవర్ని కలిశారు, ఆయన్ని ఎవరైనా ఫాలో అయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పలు ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్లు సేకరించారు. ఈ ఆధారాలను మీడియా సమావేశం పెట్టి ప్రజలకు చూపించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ ఇటీవల రాజమహేంద్రవరంలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. అయితే, మృతికి గల కారణాన్ని మాత్రం స్పెసిఫిక్గా చెప్పలేదు. ప్రెస్ మీట్లో బయటపెట్టిన ఆధారాల ప్రకారం అయితే ఇది ప్రమాదమనే అంచనాకు రావచ్చు.
ప్రవీణ్ పగడాల కేసులో ఒకవైపు పోలీసుల విచారణ జరుగుతుండగా మరోవైపు ఆయనకు సంబంధించి రోజుకో వీడియో బయటికి వస్తోంది. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే క్రమంలో ఆయన మద్యం సేవించారంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. ముందుగా హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ లిక్కర్ మార్ట్లో ప్రవీణ్.. ఆల్కహాల్ టిన్స్ కొనుగోలు చేశారని, అక్కడ యూపీఐ పేమెంట్ చేశారని నిన్న సీసీటీవీ ఫుటేజ్లు బయటికి వచ్చాయి. అలాగే, మార్గ మధ్యంలో మరో చోట రోడ్డు పక్కన వైన్ షాప్లో కూడా ఆయన మద్యం కొనుగోలు చేశారని మరో సీసీటీవీ వీడియో వైరల్ అయ్యింది. మద్యం సేవించి బైక్ నడిపిన ప్రవీణ్.. విజయవాడ వెళ్లే లోపే పలుమార్లు బైక్ మీద నుంచి పడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఊతమిస్తూ ఇప్పుడు మరో సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది.
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద హైవేపై ఉన్న వెంకటసాయి ఫుడ్ ప్లాజా సమీపంలో మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల ప్రాంతంలో బుల్లెట్పై వెళ్తోన్న ఓ వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డారు. లారీని ఎడమచేతి వైపు నుంచి ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఆయన వెనకే వచ్చిన ఆర్టీసీ బస్సు క్షణాల్లో ఆయన్ని తప్పించుకుని పక్క నుంచి వెళ్లిపోయింది. కిందపడి ఉన్న వ్యక్తిని చూసి కొంతమంది వాహనదారులు, స్థానికులు సాయం చేశారు. కింద పడిన బుల్లెట్ బైక్ని పైకి లేపారు. కాసేపు బైక్పై కూర్చొని ఆ వ్యక్తి మళ్లీ అక్కడి నుంచి విజయవాడ వైపు వెళ్లిపోయారు. అయితే, ఈ పడిపోయిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల అని అంటున్నారు. ఎల్బీ నగర్లోని లిక్కర్ మార్ట్లో, మధ్యలో ఓ వైన్ షాప్ వద్ద ఏ డ్రెస్లో అయితే ఉన్నారో.. బైక్పై నుంచి కింద పడిన వ్యక్తి కూడా అదే డ్రెస్లో ఉన్నారు. ఆ హెల్మెట్, మాస్క్ కూడా కామన్గా ఉన్నాయి. అయితే, ఈయన ప్రవీణ్ పగడాల కాదని ఆయన అనుచరులు, అభిమానులు మొదటి నుంచీ అంటున్న మాట.
ఎల్బీ నగర్లోని లిక్కర్ మార్ట్ వీడియో బయటికి వచ్చినప్పుడే.. ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదని.. ఆయన వాకింగ్ స్టైల్ అలా ఉండదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే, వీటన్నింటిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది. పూర్తిస్థాయి నివేదికలతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఫోరెన్సిక్ రిపోర్టుతో పాటు పోస్టుమార్టం రిపోర్టును పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఆసుపత్రి సూపరింటెండెంట్ అందజేశారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సుమారు 200 సీసీ కెమెరాల నుంచి సేకరించిన 13 గంటల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో రేపు ఎస్పీ మీడియా ముందు ఏం చెప్తారు అనేది అందరిలోనూ ఉత్కంఠను కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa