ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ అధ్యక్ష ఎంపికపై అఖిలేష్ యాదవ్ సెటైర్.. సభలోనే పరువు తీసిన అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 08:26 PM

బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కామెంట్లు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ఇప్పటికీ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోలేక పోతుందంటూ నవ్వారు. దీంతో వెంటనే లేచి నిలబడ్డ అమిత్ షా అఖిలేష్ యాదవ్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా సభలో అందరి ముందే ఆయన పరువు తీసేలా నవ్వుతూనే కామెంట్లు చేశారు. సభలోని వారందరు కూడా అమిత్ షా చేసిన కామెంట్లకు ఫుల్లుగా నవ్వుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


బుదవారం రోజు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించారు. ఈక్రమంలోనే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా బీజేపీ అధ్యక్ష ఎన్నికపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ తన అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేక పోతుంది అంటూ చెప్పుకొచ్చారు. నవ్వుతూనే ఆయన ఈ రకమైన కామెంట్లు చేయగా వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేచి నిలబడ్డారు. అఖిలేష్ యాదవ్ నవ్వుతూనే ఓ కామంట్ చేశారని.. అందుకు తాను కూడా నవ్వుతూనే సమాధానం చెబుతానన్నారు.


కొన్ని పార్టీలు కుటుంబ పార్టీలు అని.. ఆ పార్టీ నాయకత్వం కేవలం ఐదారుగురు సభ్యుల చేతుల్లోనే ఉంటుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. వారి నుంచి మాత్రమే అధ్యక్షుడిని నియమించుకుంటారని.. అందుకే వారికి పెద్దగా సమయం పట్టదని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ మాత్రం ఓ ప్రక్రియను పాటిస్తోందని.. తమ పార్టీలో మొత్తంగా 12 నుంచి 13 కోట్ల మంది పార్టీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ఇంత మందిలోంచి అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలంటే సమయం పడుతుందని.. కానీ కుటుంబ పార్టీలకు అంత సమయం అవసరం లేదని వెల్లడించారు. అలాగే ఆయా కుటుంబ పార్టీలకు 25 ఏల్ల పాటు ఒకరే అధ్యక్షుడిగా కొనసాగుతారని.. అందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. కానీ తమ పార్టీలో అలాంటి పరిస్థితులు ఉండవని.. కొత్త వారిని అధ్యక్షులుగా ఎంచుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.


ఇదిలా ఉండగా.. బీజేపీ సంస్థాగత ఎన్నికలు ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉండగా.. 2019లో ఆయన్ను ఎన్నుకున్నారు. ఆయితే ఆయన రెండో టర్మ్ 2024 జూక్‌తో ముగియగా.. ఇప్పటికీ ఆయనే ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈక్రమంలోనే బీజేపీ కొత్త సారథి కోసం విపరీతంగా కృషి చేస్తోంది. ఏప్రిల్ నెల చివరి నాటికి ఈ ఎన్నికల పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa