అప్పుసొప్పు చేసి పంటలు పండించాడు. కానీ దురదృష్ట వశాత్తు వాటి వల్ల నష్టాలు ఏర్పడగా అప్పుల పాయ్యాడు. బ్యాంకు రుణాలు సైతం చెల్లించలేక నరకం చూస్తున్నాడు. సర్కారు ఎలాగైనా రుణమాఫీ చేస్తుందని ఆశ పడ్డప్పటికీ.. ప్రభుత్వం స్పందించట్లేదు. దీంతో చేసేదేమీ లేక అప్పులు తీర్చేందుకు అవయవాలను అమ్మకానికి పెట్టేశాడో రైతు. ముఖ్యంగా కిడ్నీని రూ.75 వేలకు, కాలేయాన్ని రూ.90 వేలు, కళ్లను రూ.25 వేలకు అమ్ముతానంటూ మెడలో పోస్టర్ వేసుకుని తిరిగుతున్నాడు. అలాగే తన భార్యా, పిల్లల అవయవాలు సైతం అమ్మక తప్పదని.. అప్పులు తీర్చాలంటే కుటుంబ సభ్యులందరి అవయవాలు అమ్మాల్సిందేనని చెబుతున్నాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మనమూ ఓ లుక్కేద్దాం పదండి.
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా అదోలి గ్రామానికి చెందిన ఐదోలు సతీష్.. తనకున్న భూమిలోనే పంటలు పండించుకుంటూ భార్య , పిల్లలను చూసుకుంటున్నాడు. అయితే గతేడాది నుంచి బ్యాంకుల్లోంచి రుణాలు తెచ్చుకుని పంటలు పండిస్తున్నాడు. కానీ పలు కారణాల వల్ల అతడికి నష్టాలు వచ్చాయి. దీంతో అప్పులు ఎక్కువ అయ్యాయి. ఎలా తీర్చాలో తెలియక నానా అవస్థలు పడుతున్నాడు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పగా.. తనకు సాయం అందుతుందని అనుకున్నాడు. కానీ మహారాష్ట్ర సర్కారు ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. దీంతో బ్యాంకు అధికారులు అప్పులు చెల్లించాలంటూ ఇంటి మీదకు వస్తున్నారు.
ఏం చేయాలో పాలుపోని రైతు సతీష్.. తన అవయవాలు అమ్ముకోవడానికి సిద్ధం అయ్యాడు. ముఖ్యంగా ఓ పోస్టర్పై కిడ్నీ రూ.75 వేలు, కాలేయం రూ.90 వేలు, కళ్లు రూ.25 వేలకు అమ్ముతానంటూ రాయించాడు. దాన్ని మెడలో వేసుకుని కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగాడు. తన అప్పుల బాధలు వివరిస్తూనే.. ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన అవయవాలు అమ్మకున్నా అప్పులు తీరవని.. అందుకే తన భార్య, పిల్లల అవయవాలు సైతం అమ్ముతానని చెబుతున్నాడు. అయితే తన భార్య కిడ్నీని 40 వేల రూపాయలకు, కుమారుడు కిడ్నీని రూ.20 వేలకు, చిన్న కుమార్తె కిడ్నీని రూ.10 వేలకు అమ్ముతానంటూ వివరిస్తున్నాడు. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్యే నేరుగా.. రైతులకు రుణమాఫీలు చేస్తానని ప్రకటించారని సతీష్ గుర్తు చేశాడు. అప్పులపాలైనప్పటికీ ఆ ఆశతోనే తాను బతుకుతున్నానని.. కానీ కాలం గడిచి వడ్డీలు పెరిగి అప్పులు కుప్పలు అవుతున్నా సర్కారు మాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా మహాయుతి ప్రభుత్వం స్పందించి.. రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ఓ లేఖ రాసి దాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. దీంతో అక్కడుకున్న వారంతా సతీష్ నిరసనను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa