ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు ఫలితం... చంద్రబాబు ఫ్యామిలీ సంస్థ హెరిటేజ్ ఫ్రెష్‌‌కు ముస్లింల షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 06:09 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ట్విట్టర్‌లో కొన్ని ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి. హెరిటేజ్ ఫ్రెష్‌ ప్రొడెక్ట్స్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.హెరిటేజ్ ఫ్రెష్‌ ప్రొడెక్ట్స్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్‌లు, పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. అదేంటి హెరిటేజ్‌ ఫ్రెష్‌ను బాయ్‌కాట్ చేయడం అనుకుంటున్నారా.. దీనికి ఒక కారణం ఉంది. పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఎంపీలు మద్దతు తెలపడాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా హెరిటేజ్ ఫ్రెష్‌‌ను బాయ్‌కాట్ చేయాలంటూ కొందరు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్‌లు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. అలాగే అమర్‌రాజా బ్యాటరీలను కూడా బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు.


 'ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబానికి చెందిన ముస్లిం కమ్యునిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హెరిటేజ్ ఫ్రెష్‌ను బాయ్‌కాట్ చేస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీకి ముస్లిం కమ్యునిటీ వ్యతిరేకం' కొందరు ట్వీట్‌లు చేశారు. అయితే వీరి ట్వీట్‌లలో అమర్‌రాజా బ్యాటరీలను కూడా బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. అమర్‌రాజా బ్యాటరీలు టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు సంబంధించి సంస్థ. మరి అమర్‌రాజాను ఎందుకు బాయ్‌కాట్ చేయమని పిలుపునిచ్చారో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.


పార్లమెంటులో వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు ఆమోదం పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకూ విస్తృత చర్చ జరిగింది. ఆ తర్వాత కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇవ్వగా.. అనంతరం సవరణల వారీగా ఓటింగ్‌ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేయగా.. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఈ బిల్లుకు బుధవారం లోక్‌సభలోనూ సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభల్లో టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కూడా వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపింది. అందుకే సోషల్ మీడియా వేదికగా హెరిటేజ్ ఫ్రెష్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ట్వీట్‌లు, పోస్టులు పెడుతున్నారు.


ఇదిలా ఉంటే వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో ముస్లింల రక్షణ.. వారి సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. దేశంలో టీడీపీ మాత్రమే వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లులోని అభ్యంతరాలను జాయింట్‌ పార్లమెంట్‌ యాక్షన్‌ కమిటీకి సిఫార్సు చేసిందన్నారు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం గమనిస్తోందని.. కీలకమైన వక్ఫ్‌ బిల్లుపై చర్చ జరుగుతుంటే వైసీపీకి చెందిన ఒక్క ఎంపీ కూడా నోరు మెదపలేదన్నారు. నిజంగా జగన్‌కు ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ఎంపీలు ఎందుకు మాట్లడలేదని ప్రశ్నించారు. మొత్తానికి వక్ఫ్ బిల్లు వ్యవహారం హెరిటేజ్ సంస్థకు తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com