ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సీతారాముల కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై శనివారం సమీక్ష నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్యాలరీలలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం చూసేందుకు వచ్చిన భక్తులందరూ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేదిక వద్ద తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులు సీతారాముల కళ్యాణం చూసేలా 15 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం , కల్యాణ వేదిక సహా పలుచోట్ల విద్యుత్ కాంతులతో 38 దేవతా మూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం సూచిక బోర్డులు, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, 3 డ్రోన్లు, 3 కంట్రోల్ రూములు, 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం 3 లక్షల వాటర్ బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు.
మరోవైపు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకూ జరుగనున్నాయి ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి, ఏప్రిల్ 9న హనుమత్సేవ, ఏప్రిల్ 10న గరుడసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది. అనంతరం గజ వాహనసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న రథోత్సవం, ఏప్రిల్ 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa