ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెస్సీకి అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్.. ధర ఎన్ని కోట్లంటే

business |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 11:03 PM

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వంతారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మెస్సీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ ఒక అద్భుతమైన కానుక ఇచ్చారు. ఇప్పుడు ఈ కానుక విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఖరీదైన గిప్ట్ గురించిన వివరాలు తెలుసుకుందాం.


వంతారా సందర్శనకు వచ్చిన మెస్సీకి అనంత్ అంబానీ అత్యంత ఖరీదైన 'రిచర్డ్ మిల్ RM 003 వీ2 టూర్‌బిల్లాన్' వాచీని కానుకగా ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 1.1 మిలియన్ డాలర్లుగా ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీలో దీని ధర దాదాపు రూ. 9.92 కోట్లుగా ఉంటుంది. వాంతారా సందర్శన కార్యక్రమం మధ్యలో అరుదైన రిచర్డ్ మిల్లే టైమ్ పీస్ ధరించి కనిపించారు మెస్సీ. ఈ కార్యక్రమానికి మెస్సీ వాచ్ లేకుండా వచ్చారని, ఆ తర్వాత రిచర్డ్ మిల్లే ఏషియా ఎడిషన్ వాచ్ ధరించి కనిపించారని నెటిజన్లు చెబుతున్నారు.


అనంత్ అంబానీకి ఖరీదైన వాచీలంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. తన వివాహ వేడుకల సమయంలో తన స్నేహితులకు కూడా ఆయన కోట్లాది రూపాయల విలువైన వాచీలను కానుకగా ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచ మేటి ఫుట్‌బాల్ క్రీడాకారుడికి తన అభిరుచికి తగ్గట్టుగానే అత్యంత అరుదైన వాచీని అనంత్ బహుకరించారు. రిచర్డ్ మిల్ బ్రాండ్ వాచీలు వాటి డిజైన్, ఇంజనీరింగ్‌కు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అనంత్ అంబానీ బహుకరించిన ఈ నిర్దిష్ట మోడల్ మరిన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది భూమి గురుత్వాకర్షణ ప్రభావం వాచీ సమయంపై పడకుండా అత్యంత ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. ఇందులో రెండు వేర్వేరు దేశాల సమయాన్ని ఒకేసారి చూసుకునే సౌకర్యం ఉంటుంది. ఈ వాచీని తయారు చేయడానికి వాడే మెటీరియల్స్ చాలా తేలికగా, కానీ అత్యంత దృఢంగా ఉంటాయి. ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.


మెస్సీ తన భారత పర్యటనలో భాగంగా వంతారాలోని జంతు సంరక్షణ కార్యకలాపాలను ఆసక్తిగా గమనించారు. గాయపడిన, ఒంటరి జంతువుల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆసుపత్రిని, వాటి పునరావాస కేంద్రాలను ఆయన సందర్శించారు. అనంత్ అంబానీ స్వయంగా మెస్సీకి వంతారా విశేషాలను వివరించారు. వంతారా వంటి భారీ ప్రాజెక్టును చూసి మెస్సీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన ఈ ఆతిథ్యం, అద్భుతమైన కానుక పట్ల మెస్సీ అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫుట్‌బాల్ లెజెండ్, ఒక పర్యావరణ ప్రేమికుడి మధ్య జరిగిన ఈ భేటీ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa