కాకినాడ, గుంటూరు జిల్లాల్లో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వేల ఎకరాల్లోని పంట ధ్వంసమైంది. విద్యుత్తు స్తంభాలు విరిగిపడటంతోపాటు ఫీడర్ లైన్లపై తాటిచెట్లు, ఇతర వృక్షాలు పడటంతో ఎక్కిడికక్కడ వైర్లు తెగిపోయి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షానికి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని కిర్లంపూడి, చిల్లంగి, రామకృష్ణాపురం, రాజుపాలెం, ముక్కొల్లు, వీరవరం, గోనెడ, గెద్దనాపల్లి తదితర గ్రామాలతోపాటు తుని రూరల్ మండలంలోని కాకరపల్లిలో కోతకు వచ్చిన వేల ఎకరాల్లోని వరిపంట ధ్వంసమైంది. ఒక్క కిర్లంపూడి మండలంలోనే దాదాపు 4 వేల ఎకరాల్లో పంట నేలపాలైనట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. మామిడి పంటకు కూడా తీరని నష్టం వాటిల్లింది.గుంటూరు జిల్లాలోనూ అకాల వర్షం పెను నష్టం కలిగించింది. ప్రతిపాడు మండలంలో మిర్చి, పొగాకు రైతులు కల్లాల్లోని పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. ఆరబోసిన మిరపపంట చుట్టూ నీరు చేరింది. అలాగే, గొట్టిపాడు ఆది ఆంధ్రా కాలనీలో తాటిచెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగడంతో నాలుగు చెట్లు దగ్ధమయ్యాయి.కాగా, రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు ద్రోణి ప్రభావంతో మరో 5 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, నేడు, రేపు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa