కృష్ణా జిల్లా అవనిగడ్డలో శ్రీరామనవమి పండుగ వేళ కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడిలో చోటుచేసుకుంది.యావత్ భారతావని శ్రీరామనవమి వేడుకల్లో నిమగ్నమైపోయింది. వాడవాడలా జై శ్రీరామ్ నినాదాలు మార్మోగుతున్నాయి. రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశమంతటా పండగ వాతావరణం నెలకొన్న ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా నదిలోకి దిగి ముగ్గురు బాలురు చనిపోయారు. శ్రీరామనవమి నేపథ్యంలో ఆదివారం ఉదయం 15 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు కృష్ణానదిలో స్నానం చేద్దామని దిగి గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అవనిగడ్డ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డీఎస్పీ నేతృత్వంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాసేపటికే ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులు వెంకట గోపి కిరణ్(15), వీరబాబు(15), వర్ధన్(16)గా పోలీసులు తెలిపారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఒకేరోజు ముగ్గురు బాలురు చనిపోవటంతో మోదుమూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగ పూట సంబరంగా జరుపుకుందామని అనుకుంటే కృష్ణమ్మా ఎంతపనిచేస్తివమ్మా అంటూ మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa