నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తూ, అనధికారికంగా శస్త్రచికిత్సలు చేసి ఏడుగురి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ పోలీసులు ఎన్ జాన్ కామ్ అలియాస్ డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ను అరెస్ట్ చేశారు. వైద్య ప్రపంచంలోనే ఈ ఉదంతం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్లోని దామోహ్లో దారుణం వెలుగుచూసింది. ఎన్ జాన్ కామ్ అనే వ్యక్తి తనను తాను బ్రిటన్లో ఉన్నత వైద్య విద్య అభ్యసించిన కార్డియాలజిస్ట్ గా పరిచయం చేసుకున్నాడు. లండన్లోని ప్రతిష్టాత్మక సెయింట్ జార్జ్ హాస్పిటల్ నుంచి ఎంఆర్సీపీ పట్టా పొందానని, డాక్టర్ ఏ జాన్ కామ్ వద్ద ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో శిక్షణ పొందానని, అమెరికాలో ఫెలోషిప్లు పూర్తి చేశానని, ఢిల్లీలోని ఎస్కార్ట్స్, హైదరాబాద్లోని వోక్హార్ట్ వంటి పేరున్న ఆసుపత్రుల్లో పనిచేశానని చెప్పుకున్నాడు. చివరికి, గత పదేళ్లలో 15,000 పైగా క్లిష్టమైన యాంజియోప్లాస్టీలు చేసినట్లు నమ్మబలికాడు.
అయితే, పోలీసుల దర్యాప్తులో అతని అసలు రంగు బయటపడింది. అతని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నకిలీదని తేలింది. ఈ విషయాన్ని అతనే అంగీకరించాడు. అతను 1996లో నార్త్ బెంగాల్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేశానని చెబుతున్నాడు, దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఎంబీబీఎస్ డిగ్రీ కూడా నకిలీదని తేలితే, అతను ఇప్పటివరకు చేసిన వేలాది ఆపరేషన్లు చట్టవ్యతిరేకం అవుతాయి.
దామోహ్లోని మిషన్ హాస్పిటల్లో రెండు నెలల క్రితం నెలకు రూ. 8 లక్షల భారీ జీతానికి ఇతడు చేరాడు. ఆసుపత్రి యాజమాన్యం కనీసం మధ్యప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో అతడి వివరాలు సరిచూసుకోలేదు. ఈ కొద్ది కాలంలోనే అతను 13 మందికి సర్జరీలు చేయగా, వారిలో ఏడుగురు మరణించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
దామోహ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.కె. జైన్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. విచారణ ప్రారంభమయ్యేసరికి కామ్ ఆసుపత్రి నుంచి రాజీనామా చేసి పారిపోయాడు. అతడి రిజిస్ట్రేషన్ నకిలీదని నిర్ధారణ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, చివరకు ప్రయాగ్రాజ్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో తెలంగాణలో నమోదైన ఓ చీటింగ్ కేసులోని నిందితుడు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్, ఈ ఎన్ జాన్ కామ్ ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం అతనిపై ఫోర్జరీ, అనధికార వైద్యం, రోగుల మరణాలకు కారణమవడం వంటి తీవ్రమైన అభియోగాలపై భారతీయ న్యాయ సంహిత, మధ్యప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అతని అంతర్జాతీయ డిగ్రీల వాస్తవికతను తేల్చడం, గతంలో పనిచేసిన ఆసుపత్రుల్లోనూ ఇలాంటి మరణాలు సంభవించాయా? అని దర్యాప్తు చేయడం పోలీసులకు సవాలుగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa