పంజాబ్ బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా నివాసం బయట సోమవారం రోజు అర్ధరాత్రి ఒంటి గంటకు భారీ పేలుడు సంభవించింది. ఎవరో దుండగులు రాత్రిపూట ఆటోలో వచ్చి ఆయన ఇంటిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఫలితంగా పెద్ద ఎత్తున పేలుడు జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదం వల్ల ఎవరికీ గాయాలు కాలేదు. ముఖ్యంగా బేజీపే నేత క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గ్రెనేడ్ దాడికి పాల్పడింది ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
పంజాబ్ బేజీపీ నాయకుడు మనోరంజన్ కాలియా జలంధర్లో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రోజు అర్ధరాత్రి 1 గంటలకు ఈయన నివాసం వెలుపల భారీ పేలుడు సంభవించింది. అయితే ఇంట్లో పడుకున్న మనోరంజన్ కాలియా అది ఉరుముగా భావించారు. కానీ వాచ్మెన్, ఆయన గన్మెన్లు అది పేలుడు అని ఫోన్ చేసి చెప్పగా.. వెంటనే ఆయన అప్రమత్తం అయ్యారు. ఎవరో కావాలనే ఇలా చేసుంటారని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ముఖ్యంగా ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈక్రమంలోనే ఎవరో ఆగంతకులు ఆటోలో వచ్చి ఇంటిపై గ్రెనేడ్ విసరడం కనిపించింది. ఆపై అదే ఆటోలో వారు పారిపోయినట్లు చూసిన పోలీసులు షాకయ్యారు. కావాలనే దాడి చేశారని తెలుసుకుని.. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే అదృష్ట వశాత్తు బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా సురక్షితంగా ఉన్నారని... జలంధర్ పోలీస్ కమిషనర్ మన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పేలుడు వల్ల ద్వారం దగ్గర ఉన్న ఓ తలుపు దెబ్బతిందని వివరించారు.
బీజేపీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి జరగడంతో.. అనేక మంది ఆయన నివాసానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు సహా కార్యకర్తలు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసులు సైతం ఆయన ఇంటి వద్ద మరింత భద్రతను పెంచారు. చూడాలి మరి ఎప్పటిలోపు పోలీసులు నిందితులను పట్టుకుంటారు, వారు అసలు ఎందుకు ఈ దాడి చేశారనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa