తిరుపతి జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ తిన్నారు. మహేశ్వరయ్య అనే వ్యక్తి చంద్రగిరి ఈవోగా గతంలో పనిచేశారు. అయితే లంచం తీసుకుంటూ దొరికిపోవటంతో సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉండటంతో ఏసీబీ ఈయనపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మహేశ్వరయ్య ఇళ్లు, ఫామ్హౌస్లు, అత్తగారింట్లో సోదాలు జరపగా.. రూ.85 కోట్ల వరకూ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించినట్లు తెలిసింది. కానీ ఓ పంచాయతీ కార్యదర్శి కూడబెట్టిన ఆస్తుల లెక్క చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. మీరేమిటి అవినీతి నిరోధక శాఖ అధికారులే నివ్వెరపోయారంటే నమ్మండి. మహేశ్వరయ్య అనే ఆయన తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ ఈవోగా పనిచేసేవారు. అయితే లంచాలకు అలవాటుపడిన మహేశ్వరయ్య ఫిబ్రవరిలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది. ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చారు.
అయితే మహేశ్వరయ్య తీరుపై అనుమానంతో అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు మహేశ్వరయ్యపై నిఘా పెట్టారు. ఊ క్రమంలోనే తిరుపతి రూరల్ మండలం పేరూరు జర్నలిస్టు కాలనీలో ఉన్న మహేశ్వరయ్య ఇల్లు, గంగవరం సమీపంలోని ఫామ్హౌస్, అత్తగారింట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో మహేశ్వరయ్య భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. పేరూరులోని మహేశ్వరయ్య ఇల్లు, పలమనేరు, గంగవరం, బద్వేలు, బెంగళూరులో జరిపిన సోదాల్లో భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. పేరూరులోని మహేశ్వరయ్య ఇంటిలో కిలో బంగారం, వెండి, రూ.2 లక్షల వరకూ నగదు, రూ.35 లక్షల టర్మ్ డిపాజిట్ల బాండ్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లు, బైక్లను ఏసీబీ సీజ్ చేసింది.
మహేశ్వరయ్యకు పలమనేరులో రూ.3 కోట్లు విలువ చేసే మూడంతస్థుల ఇల్లు, ఫాంహౌస్, బినామీ పేర్లతో భూములు, ప్లాట్లు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాల్లో తేలింది. గంగవరంలో వ్యవసాయ భూమితో పాటుగా కోళ్లఫారం, స్థిరచరాస్థులు ఉన్నట్లు వెల్లడైంది. అలాగే బెంగళూరులో రూ.10 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ ఉన్నట్లు రికార్డుల్లో బయటపడింది. అత్తగారి ఊరైన బద్వేలులోనూ బినామీల పేరుతో ప్లాట్లు, భూములు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు, లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తంగా ఈ పంచాయతీ కార్యదర్శికి రూ.85 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది.
లాకర్లను తెరిచే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చిత్తూరు జిల్లా గంగవరంలో మహేశ్వరమయ్య అమ్మవారి ఆలయం నిర్మించారు. ఇటీవలే ఈ ఆలయాన్ని ఆధునీకరించినట్లు స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా పంచాయతీ కార్యదర్శి కూడబెట్టిన ఆస్తుల జాబితా చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa