అమరావతి నుండి హైదరాబాద్కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్లో మరో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సూచించింది. ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా సత్వర చర్యలను ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరికొన్ని సమస్యల పరిష్కారాలకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ హైవే అమరావతి నుంచి హైదరాబాద్కు ఏ రూట్లో ప్లాన్ చేశారన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం అమరావతి నుంచి హైదరాబాద్కు రెండు రూట్లు ఉన్నాయి. ఒకటి విజయవాడ మీదుగా హైదరాబాద్కు రూట్ ఉంటే.. మరొకటి పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్కు వెళ్లొచ్చు.. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించింది.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన అంశాలపై క్లారిటీకి వచ్చారు. ఈ మేరకు విభజన చట్టంలోని అంశాలు, ఆస్తుల పంపకం, ఆర్థికపరమైన సమస్యలపై చర్చించారు. ఏపీ ఎస్ఎఫ్సీ విభజన, షెడ్యూల్ 9, 10లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకంపై ప్రధానంగా చర్చించారు. అలాగే, విదేశీ రుణాల పంపకం, రోడ్డు, రైలు, విద్యా సంస్థలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి.
అలాగే రెండు రాష్ట్రాల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యా సంస్థల పనులపై సమీక్ష చేశారు.
ఈ సమావేశంలో భాగంగా అమరావతి నుంచి హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను వెంటనే తయారు చేయాలని రోడ్లు, రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే
ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్కు ఇదివరకే అనుమతి వచ్చింది. ఇప్పుడు మరో రిఫైనరీని ఏర్పాటు చేయాలనే ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు హోం శాఖ సూచించింది. విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ రాగా.. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూల్ కారిడార్ ఏర్పాటును కేంద్ర రైల్వే శాఖ పరిశీలించనుంది.
వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే గ్రాంట్ల విషయంలో ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక, వ్యవసాయ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. అమరావతి - అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్లు రూపొందించాలని, అనుమతులు ఇవ్వాలని ఏపీ కోరగా, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అమరావతి రింగ్ రోడ్డును ముందుగా అనుకున్న విధంగా 6 లైన్లలో 70 మీటర్ల వెడల్పుతో నిర్మించాలనే ప్రతిపాదనకు అలైన్మెంట్ పూర్తయిందని, మరో నాలుగు నెలల్లో కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపుతామని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ అధికారులు తెలిపారు. అమరావతి రైల్వే కనెక్టివిటీ కోసం ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు సెక్షన్ పనులు ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో లైన్ ప్రాజెక్టులకు సంబంధించి మరింత సమాచారం కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa