ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్వీ గోశాలలో గోవుల మృతి వదంతులు నమ్మొద్దు.. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 05:49 PM

తిరుపతి తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు చనిపోయాంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేయటంతో పాటుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.  ఇదిలావుంటే ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై వస్తున్న ఆరోపణలను టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు ఖండించారు. ఈ ప్రచారం అవాస్తవమని, ఇది హిందూ ధర్మ పరిరక్షణకు అంకితమైన టీటీడీపై బురద జల్లే ప్రయత్నమని బీఆర్ నాయుడు అన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలలో జరిగినట్లుగా చూపిస్తున్నారని , ఇలాంటి వదంతులను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. గోసేవను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.


" టీటీడీ ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రచారం చేస్తున్న అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరం. శ్రీవారి చరణాల సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరం. గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణం. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నాం. ఏ ఒక్క గోవు మృతి కూడా సామాన్యంగా తీసుకోలేము, కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగా, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మం." అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.


మరోవైపు దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విమర్శించారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని సూచించారు. గోసేవా అంటేనే గోదేవి సేవగా అభివర్ణించిన టీటీడీ ఛైర్మన్.. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.


మరోవైపు టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదంటూ టీటీడీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన గోవులు ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని.. కొంతమంది దురుద్దేశంతో ఇలా మృతి చెందిన గోవులు ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa