ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్.. 10 మందికి అస్వస్థత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 06:08 PM

నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. నెల్లూరు జిల్లా టీపీగూడూరు మండలం అనంతపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీకైంది. ఒక్కసారిగా అమోనియా గ్యాస్ లీక్ కావటంతో అందులో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. అయితే ఈ గ్యాస్ లీక్ ఘటనలో పది మంది కార్మికులు గాయపడ్డారు. తోటి కార్మికులు, సిబ్బంది వీరిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అమోనియా గ్యాస్ ఆ చుట్టుపక్కల గ్రామాలకు సైతం వ్యాపించింది. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. ఈ వాయువును పీలిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే భయంతో ముందుజాగ్రత్తగా మాస్కులు ధరించారు. మరోవైపు ప్రస్తుతం గ్యాస్ లీక్ కాకుండా ఆపివేసినట్లు తెలుస్తోంది.


అమ్మోనియా గ్యాస్ లీకేజీపై నెల్లూరు ఆర్డీవో క్లారిటీ ఇచ్చారు. వాటర్ బేస్ గ్యాస్‌ కంపెనీలో గ్యాస్ లీకైందన్నారు. అయితే వెంటనే అలారం మోగిందని, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారన్నారు. ఈ సమయంలో కిందపడి కొందరికి గాయాలయ్యాయని.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నారని నెల్లూరు ఆర్డీవో క్లారిటీ ఇచ్చారు.


మరోవైపు గత మార్చి నెలలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ అయిన ఘటన తెలిసిందే. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని కేశనపల్లి గ్రూప్ గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓఎన్‌జీసీ గ్రూప్ గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్‍లో ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకైన వెంటనే కొంతమంది ఘటనా స్థలి నుంచి పరుగులు తీశారు. మరి కొంతమంది గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గ్యాస్ వాసన పీల్చి 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


కోనసీమలో గ్యాస్ లీక్ కలకలంబోరులోంచి ఎగిసిపడుతున్న మంటలు


మరోవైపు ఏపీలో అప్పుడప్పుడూ గ్యాస్ లీకేజ్ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫార్మా కంపెనీలలో అప్పుడప్పుడూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీలలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిరంతరం పర్యవేక్షణతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa