ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ స్ట్రగుల్ అవుతున్నాడు.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 07:41 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల 5వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‍తో పాటుగా ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వేరే ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి స్ట్రగుల్ అవుతున్నారని.. అయినా మంచిగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానోత్సవంలో జరిగిన ఘటనను చంద్రబాబు ఈ సందర్భంగా ఉదహరించారు.


" మిత్రుడు పవన్ కళ్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చి స్ట్రగుల్ అవుతున్నాడు. అయినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నిన్ననే చూశారు. అదో ఉదాహరణ. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోరికను నెరవేర్చాం. ఎన్నో పిటిషన్లు, రిట్లు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ.. 31 కేసులు పరిష్కరించి నిన్న (మంగళవారం) వారికి ( కానిస్టేబుల్ నియామక పత్రాలు) ఉద్యోగాలు ఇచ్చాం. డీఎస్సీ విషయంలోనూ ఇదే గందరగోళం చేశారు. నిన్న మీటింగ్‌లో బాబూరావు అనే కానిస్టేబుల్ ఓ రిక్వెస్ట్ చేశాడు. నాకు ఉద్యోగం వచ్చింది.. మా ఊరికి రోడ్డు వేయించండి సార్.. అని కోరాడు. పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ పరిధిలో ఉండటంతో నేను ఆయనను కోరా. ఆయన వెంటనే అధికారులను ఆదేశించి అంచనా వ్యయం రూపొందించి మీటింగ్‌లోనే ప్రకటించాం. అది బాధ్యతగల ప్రభుత్వం పనిచేసే తీరు. అదీ ప్రొయాక్టివ్ గవర్నెన్స్.." అంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్.. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే నాటి ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత వివిధ కారణాలతో 2019 ఎన్నికల్లో ఈ రెండూ పార్టీలకూ దూరం జరిగిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిపారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటంతో పాటుగా.. జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది.


 ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి బరిలోకి దిగగా.. ఎన్డీఏ కూటమి ఏకంగా 164 చోట్ల గెలుపొందింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లోనూ గెలిచి వందశాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సినీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa