ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 06:14 PM

సచివాలయాల్లో రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వం చేస్తున్న మార్పులతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొందని, ఇది కచ్చితంగా సచివాలయ ఉద్యోగులను తగ్గించే చర్య అని వైయ‌స్ఆర్‌సీపీ పెన్షనర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అయన మాట్లాడుతూ......  గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్టోబర్‌ 2న, 2019న గాంధీ జయంతి రోజున ఒకేసారి దాదాపు 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించిన ఘనత నాటి సీఎం వైయస్‌ జగన్‌కు దక్కుతుంది.  అన్ని రకాల సౌకర్యాలు కల్పించి 10 మంది ఉద్యోగులతో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిట్లోకే సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు తెర తీసింది. 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నా, దాన్ని పూర్తిగా వదిలేసింది. మరో వైపు 1.27 లక్షల ఉద్యోగుల్లో 15 వేల మంది ఎక్కువ అంటూ ప్రచారం చేస్తోంది. ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలనే తొలగించి ఉద్యోగుల పొట్ట కొట్టింది. పైగా ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు గడిచినా ఎన్నికల్లో చెప్పినట్టు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. రేషనలైజేషన్‌ పేరుతో జనాభా ప్రాతిపదికన సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు జీవో నెం.1 జారీ చేశారు. ఉద్యోగులను జనరల్, టెక్నికల్‌ సిబ్బందిగా విభజించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనరల్‌ విభాగాలకు కేటాయించిన సిబ్బంది విధులకు సంబంధించి జీవో ఎంఎస్‌ నెం.3 జారీ చేసిన ప్రభుత్వం, టెక్నికల్‌ విభాగాలకు కేటాయించిన సిబ్బంది విధులకు సంబంధించి త్వరలోనే మరో జీవో విడుదల చేస్తామని ప్రకటించింది. సచివాలయాలతో పాటు, రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఉన్న 4 వేల ఖాళీ పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న యువత ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది అని ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa