తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన గోశాలలో మూడునెలల్లో వందకు పైగా గోవులు మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం తక్షణం నిజనిర్ధారణ కమిటీని వేసి, విచారణకు ఆదేశించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన గోవుల మరణాలపై బాధ్యత కలిగిన టీటీడీ అధికారులు బయటకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరుమల పవిత్రత మంటగలిసే ఘటనలే వరుసగా జరుగుతున్నాయని, వీటిని చూస్తూ హిందువులు మనోవ్యథకు గురవుతున్నారని అన్నారు. అయన మాట్లాడుతూ.... మూడు నెలల్లో టీటీడీ గోశాలలో నూరు గోవులు మృత్యువాత పడ్డాయని వైయస్ఆర్సీపీ బయటపెట్టింది. దీనిపై మంత్రి లోకేష్ బాధ్యత లేకుండా ఇదంతా దుష్ప్రచారం అంటూ చాలా తేలికగా కొట్టిపారేశారు. బీజేపీ నేత భానుప్రకాశ్ ఇందులో కొంత వాస్తవం ఉందని అంగీకరించారు. మేం ఫోటోలతో సహా గోశాలలో గోవులు ఎలా చనిపోయి పడి ఉన్నాయో ఆధారాలతో బయటపెట్టాం. బాధ్యత కలిగిన ఏ టీటీడీ అధికారి దీనిపై మాట్లాడలేదు. మీకు చిత్తశుద్ది ఉంటే గోశాలలో గోవుల మరణాలపై ఒక కమిటీని వేసి, నిజాలను ప్రజలకు, హిందూసమాజానికి వెల్లడించాలి. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అయినా తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా రాజకీయ కేంద్రంగా తయారు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి భక్తులకు సేవలందించే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రోజు ముగ్గురు వ్యక్తులు అన్ని భద్రతలను దాటుకుని, పాదరక్షలతో శ్రీవారి మహాద్వారం వద్దకు వెళ్ళారు. ఇది స్వామివారి క్షేత్రాన్ని అపవిత్రం చేయడం కాదా? దీనిని టీటీడీ ఎలా సమర్థించుకుంటుంది? మధ్యాహ్నం స్వామివారి నైవేథ్యం కూడా పదిహేను నిమషాల పాటు ఆలస్యం అయిందంటే స్వామివారి పట్ల టీటీడీకి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతోంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa