ఐపీఎల్లో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 18వ ఎడిషన్లో తేలిపోతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో ఇతర జట్లు సత్తాచాటుతుండగా.. సీఎస్కే మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ టోర్నీని గెలుపుతో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత వరుసగా ఓటములు చవిచూస్తోంది. ఆడిన ఆరు మ్యాచ్లలో వరుసగా ఐదింట్లో ఓడి.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టినా.. ఆ జట్టు ఆటతీరు మాత్రం మారలేదు.
శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది. తొలుత 103/9 పరుగులకే పరిమితమైంది చెన్నై. ఆ తర్వాత దాదాపు సగం ఓవర్లు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయం సాధించింది. బ్యాటర్లు విఫలమవుతుండటం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. అయితే కేకేఆర్తో మ్యాచ్ తర్వాత మాట్లాడిన ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైకెల్ హస్సీ.. ఆటగాళ్లను వెనకేసుకొచ్చాడు. తమ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని.. మున్ముందు మెరుగైన క్రికెట్ ఆడతామని చెప్పుకొచ్చాడు.
“మా టీమ్ (చెన్నై సూపర్ కింగ్స్) బాగానే ఉంది. జట్టులో ఆటగాళ్లంతా మంచి ప్లేయర్లే. అయితే వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు మేం ప్రయత్నిస్తాం. టోర్నీలో మిగతా మ్యాచ్లలో మరింత నాణ్యమైన క్రికెట్ ఆడేలా ప్రోత్సహిస్తాం. బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్ ఏదైనా సరే చురుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మా ఆటతీరుపై చాలా రకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏది ఏమైనా మా ప్లేయర్లను ఎప్పుడూ వారు ఆడేవిధంగా కాకుండా భిన్నంగా ఆడాలని ఎప్పుడూ చెప్పం. సహజంగా ఆడితే ఫలితం బాగుంటుంది. మేం ఏ ప్లేయర్పై కూడా ఒత్తిడి తీసుకురాం” అని చెప్పాడు.
“గతంలో షేన్ వాట్సన్, అజింక్య రహానె వంటి ప్లేయర్లతో మా జట్టు మిడిలార్డర్ బలంగా ఉండేది. ఇప్పుడున్న వారిలోనూ ఆ రేంజ్ ప్లేయర్లు ఉన్నారు. తుది జట్టులోనే కాదు రిజర్వ్ బెంచ్పై కూడా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ మంచి ప్లేయర్లు ఉన్నారు. ఒక్కసారి జోష్ వచ్చిందంటే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-4లోకి రావడం పెద్ద కష్టమేం కాదు” అని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa