నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉందని, శిక్షలు తప్పవనే భయంతోనే ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు."దేశంలో వేల కోట్లు మోసం చేసిన మెహుల్ చోక్సీ, ముంబై పేలుళ్ల నిందితుల వంటి వారినే అరెస్ట్ చేసి తీసుకువస్తున్నారు. కానీ కాకాణిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. దీన్నిబట్టి ఆయన ఎంతటి వారో అర్థమవుతోంది" అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.కాకాణి ఒక పిరికిపంద అని, సవాళ్లు విసిరి ఇప్పుడు కేసులకు భయపడి పరారీలో ఉన్నారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, అయితే తాను కాకాణిలా పారిపోకుండా వాటిని ఎదుర్కొన్నానని సోమిరెడ్డి పేర్కొన్నారు.జిల్లాలో సుమారు 61,000 మెట్రిక్ టన్నులకు పైగా విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వేశారని, దీని విలువ వందల కోట్లలో ఉంటుందని సోమిరెడ్డి తెలిపారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై తాను ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టలేదని, 2023లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో, కాకాణి మంత్రిగా ఉన్నప్పుడే గనుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన గుర్తుచేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా అప్పట్లో చర్యలు తీసుకోలేదని, ఆ ఫైళ్లే ఇప్పుడు బయటకు వస్తున్నాయని సోమిరెడ్డి వివరించారు.గతంలో ఫోర్జరీ పత్రాల కేసులో కూడా కాకాణి ఇలాగే రెండు నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారని, జిల్లా కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టులో షరతులతో కూడిన బెయిల్ పొందారని సోమిరెడ్డి గుర్తుచేశారు. "అప్పుడు రెండు నెలలు హెడ్ కానిస్టేబుల్ ముందు సంతకాలు పెట్టినా ఆయనకు సిగ్గురాలేదు. చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు" అని సోమిరెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa