ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో ఏఐ శాస్త్రవేత్తలు అకస్మిక మరణాలు.. మూడేళ్లలో ఐదుగురు

international |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 10:53 PM

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యం, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో చైనాకు చెందిన ఏఐ శాస్త్రవేత్తల ఆకస్మిక మరణాలు ఆందోళనకు గురిచేస్తోంది. 2022 నుంచి 2025 మధ్య మూడేళ్లలో అనేక మంది ఏఐ నిపుణులు ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో చనిపోయారు. వీరిలో చాలామంది అమెరికాలో చదువుకుని, అక్కడ పనిచేసి చైనాకు తిరిగొచ్చిన వారు కావడం గమనార్హం. ఈ మరణాలపై సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సంచలన నివేదిక వెల్లడించింది. చైనాకు చెందిన ఏఐ శాస్త్రవేత్తలు చిన్న వయసులోనే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇటీవల భారత సంతతికి చెందిన ఏఐ నిపుణుడు సుచీర్ బాలాజీ కూడా అనుమానాస్పందంగానే చనిపోయిన విషయం తెలిసిందే.


అమెరికాలో 35 పేటెంట్లు పొందిన మైక్రోసాఫ్ట్ మాజీ పరిశోధకుడు సన్ జియాన్ (45) 2022 జూన్‌లో హఠాత్తుగా మరణించారు. ఆయన పేటెంట్లలో 13 అంతర్జాతీయంగా నమోదయ్యాయి. అమెరికా నుంచి చైనాకు వచ్చిన ఆయన బీజింగ్‌లోని మెగ్వీ టెక్నాలజీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేసేవారు. చైనా రక్షణ రంగంలో ఏఐ నిపుణుడిగా పనిచేసిన ఫెంగ్ యాంగే (38) జులై 2023లో చనిపోయారు. అలాగే, చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌లో ప్రొఫెసర్‌, సెన్స్‌టైమ్ వ్యవస్థాకుడు టాంగ్ జియావో (55) కూడా ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.


ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ సంస్థలో పనిచేసిన హే జీ (41) 2024లో గుండెపోటుతో మృతిచెందారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తల్లో ఒకరిగా స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ గుర్తించిన సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసే క్వాన్ యుహున్ (39) ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో మరణించారు. చైనా AI నిపుణులు సంపాదనతో పాటు ఒత్తిడి కూడా ఎక్కువే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.


చైనా ఏఐ రంగ నిపుణుడు లియు షావోషన్ మాట్లాడుతూ.. ‘‘ఒక ఆలోచనతో స్వదేశానికి వచ్చి పరిశోధనలు చేసేసరికి, అప్పటికే మరొక వ్యక్తి అలాంటి అంశంపైనే ప్రాజెక్టు పూర్తి చేస్తే అది మరింత ఒత్తిడిని పెంచుతుంది’’ అని అన్నారు. అంటే, ఒక కొత్త ఆలోచనతో ఏదైనా చేయాలనుకున్నప్పుడు, తమకంటే ముందే వేరొకరు ఆ పనిని పూర్తి చేస్తే నిరాశ కలుగుతుందని, దీనివల్ల సమాజంలో మార్పులు వస్తాయని, అది కూడా ఒక రకమైన ఒత్తిడికి కారణమవుతుందని ఆయన అన్నారు. సమాజంలో ఎదురయ్యే మార్పులు సైతం నైతికంగా మరింత ఆందోళనకు కారణమవుతున్నాయని షావోషన్ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది చైనా డీప్‌సీక్‌తో ప్రపంచాన్ని గడగడలాడించింది. అలాగే, డీప్‌సీక్ యాపిల్ యాప్‌స్టోర్‌లో అగ్రస్థానంలో ఉన్న చాట్‌జీపీటీని కూడా వెనక్కి నెట్టింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa