ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫ్గనిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే

international |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 10:52 PM

అఫ్గనిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు యూరోపియన్ మెడిటేర్రియన్ సెస్మాలాజికల్ సెంటర్  వెల్లడించింది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 121 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు తెలిపింది. హిందూ కుష్ ప్రాంతంలో బఘ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. అక్టోబరు 2023లో హరాత్ ప్రావిన్స్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ భూకంపానికి 2,445 మంది చనిపోగా.., 9,420 మంది గాయపడ్డారు. జిందా జాన్ జిల్లాలోని 11 గ్రామాల్లో ఈ భూకంపం తీవ్రంగా ప్రభావం చూపింది. తాజా భూకంప కేంద్రం 55 కి.మీ దూరంలో ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది


వరుస భూకంపాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత, వైద్య సేవలు కొరతతో బాధపడుతున్న అఫ్గనిస్థాన్‌లో మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. అంతర్జాతీయ సహాయం అవసరమైనప్పటికీ, అఫ్గన్‌లో తాలిబాన్ దుర్మార్గపు పాలనపై ఉన్న అనుమానాల కారణంగా సహాయం ఆలస్యం అవుతోంది. అయితే, తాజా భూకంపానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అఫ్గన్‌పై తరుచూ భూకంపాలు విరుచుకుపడి.. అపార ప్రాణ, ఆస్తినష్టం కలిగిస్తుంటాయి. అఫ్గన్‌లో భూకంప ప్రభావంతో భారత్‌లోనూ పలు చోట్ల ప్రకపంపనలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది.


ఇటీవల మయన్మార్, థాయలాండ్‌లో వచ్చిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మార్చి 28న మయన్మార్‌లో సంభవించిన భూకంపానికి దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గాయపడ్డారు. అపార ఆస్తినష్టం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 470 వరకూ ప్రకపంపలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 13న భారత్‌తో పాటు మయన్మార్, తజకిస్థాన్‌లో గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చినట్టు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa