ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆటో బోల్తా.. ఒకరి మృతి.

Crime |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 10:59 PM

సూర్యాపేట జిల్లాలో కూలి పనికి వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మిరపకాయలు తెంపడానికి ఉదయాన్నే నవ్వుతూ వెళ్లిన ఆ తల్లి.. సాయంత్రానికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ ఊరంతా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోట పహాడ్ వద్ద మిరప కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. టేకుమట్ల గ్రామానికి చెందిన కూలీలు బొప్పారంలో మిరపకాయలు తెంపడానికి ఆటోలో బయలుదేరారు.


కానీ.. కోటపాడు ఊరి సమీపంలోకి రాగానే.. హఠాత్తుగా ఒక కుక్క అడ్డు రావడంతో.. దానిని తప్పించబోయిన డ్రైవర్ ఒక్కసారిగా ఆటోను తిప్పాడు. క్షణాల్లో అదుపుతప్పిన ఆటో భయంకరంగా పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న కూలీలందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మాదరబోయిన యాదమ్మ అనే మహిళ తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.


యాదమ్మ మరణంతో ఆమె కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఆమె భర్త, పిల్లల ఆర్తనాదాలు ఆ ప్రాంతాన్నంతా కలచివేస్తున్నాయి. ఆటోలో ఉన్న మిగతా పది మంది తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే సూర్యాపేట జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa