తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుండి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సురానా ఇండస్ట్రీస్తో పాటు దాని అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లపై ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్తో సాయి సూర్య డెవలపర్స్ సన్నిహితంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఈడీ అధికారులు నగరంలోని కీలక ప్రాంతాలైన సికింద్రాబాద్, బోయిన్పల్లి మరియు జూబ్లీహిల్స్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సోదాలు సురానా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల నివాసాలతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో కూడా కొనసాగుతున్నాయి. ఈడీ ప్రత్యేక బృందాలు.. ముఖ్యంగా చెన్నై నుండి వచ్చిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సురానా గ్రూప్ చెన్నైలోని ఒక ప్రముఖ బ్యాంకు నుండి వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందింది.
అయితే.. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన కారణంగా ఇప్పటికే సురానా గ్రూప్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. తాజాగా.. ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరింత లోతైన దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈడీ అధికారులు త్వరలో దీనిపై మరింత సమాచారం అందించే అవకాశం ఉంది. ఈ దాడులు హైదరాబాద్ యొక్క వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి.
మరోవైపు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. పలు ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే.. ఈ పథకంలో దాదాపు రూ. 700 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని ప్రాథమికంగా తేలడంతో.. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
తాజాగా.. ఈ గొర్రెల పంపిణీ స్కాం కేసు విచారణను ఈడీ అధికారులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలైన ఈ గొర్రెల పెంపకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే తెప్పించుకున్నారు. ఈ సమగ్ర సమాచారం ఆధారంగా.. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ను ఈడీ అధికారులు క్షుణ్ణంగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ కేసులో ఏసీబీ అధికారులు పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa