తమిళనాడులోని రామనాథపురం జిల్లా కుసవంకుడి గ్రామంలో సుబ్బయ్య ఆలయ ఉంది. అయితే ప్రతీ ఏడు ఈ గుడిలో వార్షికోత్సవాలు నిర్వహిస్తారు. ఈ జాతరకు గ్రామానికి చెందిన భక్తులే కాకుండా పక్క ఊళ్ల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో నిర్వహించే అగ్ని గుండాలు తొక్కితే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకం ఉంది. దీంతో వందలాది మంది భక్తులు ప్రతీ ఏటా అగ్నిగుండాలపై నడుస్తుంటారు. అయితే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఉత్సవాలు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన అగ్నిగుండాలు కూడా నిర్వహించారు.
దీంతో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు భక్తులు అంతా నిప్పులపై నడిచేందుకు సిద్ధం అయ్యారు. అనేక మంది ఎర్రగా మండుతున్న నిప్పులపై పరుగులు పెట్టారు. ఇందులో భాగంగానే అదే జిల్లా వలంతరవాయ్ గ్రామానికి చెందిన 56 ఏళ్ల కేశవన్ కూడా నిప్పులపై నడవాలనుకున్నాడు. మనసులో ఓ కోరిక కోరుకుని ఆ స్వామి వారిని తలుచుకుంటూ అగ్ని గుండాలపై నడిచాడు. కానీ దుదృష్టవశాత్తు నిప్పులపై నడుస్తుండగానే కాలుజారి నిప్పుల్లో పడిపోయాడు. దీంతో క్షణాల్లోనే ఆయన ఒళ్లంతా కాలిపోయింది. విషయం గుర్తించిన భక్తులు, రెస్క్యూ టీం వెంటనే అతడిని బయటకు తీసుకువచ్చారు.
వెంటనే రామనాథపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. దైవ దర్శనం కోసం వెళ్లి ఆ దేవుడి చెంతకే వెళ్లిపోయాంటూ రోదిస్తున్నారు. ఆలయ ఉత్సవాల్లో చనిపోవడంతో.. గ్రామస్థులంతా ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా ఈ ఉత్సవాలు చేస్తున్నా ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదని.. తొలిసారి ఇలా జరగడం తమను తీవ్రంగా కలిచి వేస్తుందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa