తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. జులై నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం, వసతి గదుల ఆన్లైన్ కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన,అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం రేపు ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులకు.. డబ్బులు చెల్లించి టికెట్లు పొందేందుకు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ సమయం ఉంది. ఏప్రిల్ 21 నుంచి సొమ్ము చెల్లించవచ్చు.
మరోవైపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జులై 22న విడుదల చేయనున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను 22 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను 22 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జులై నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జులై నెల శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
ఇక తిరుమలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కేటాయించే జులైన నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది. అలాగే తిరుమల ఆన్లైన్ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa