ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 18) జరగాల్సిన ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7 గంటలకు టాస్ పడి.. 7.30కి మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా టాస్ కూడా ఇంకా పడలేదు. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడం ఐపీఎల్ 2025లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గత రెండు, మూడు గంటల నుంచి వర్షం పడుతుండటంతో స్టేడియం మొత్తం కవర్లు కప్పి ఉంచారు. దీంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులంతా స్టేడియంలోనే తడిసిపోయారు. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు తడిసిన బట్టలతోనే వెయిట్ చేస్తున్నారు. అయితే వర్షం ప్రస్తుతం తక్కువగానే కురుస్తోంది.
వర్షం నిలిచిపోయిన కాసేపటికే మ్యాచ్ కోసం స్టేడియం సిద్ధం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రపంచంలోనే అత్యాధునికమైన డ్రైనేజీ సిస్టమ్ ఉంది. దీని ద్వారా సుమారు అరగంట సమయంలోనే స్టేడియాన్ని మ్యాచ్కు సిద్దం చేయొచ్చు.
ఓ దశలో తగ్గినట్లే తగ్గిన వర్షం మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆటగాళ్లు కూడా డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యారు. మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం లేదని సమాచారం. ఓవర్లు కుదించినా.. మ్యాచ్ ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి 10.54 వరకు మైదానం సిద్ధం చేసినా.. కనీసం 5 ఓవర్ల ఆట ఆడించే అవకాశం ఉంది. మరి వరుణ దేవుడు కరుణిస్తాడో లేదో చూడాలి.
ఒకవేళ మ్యాచ్ రద్దైతే.. ఇరు జట్ల ఖాతాల్లోకి ఒక పాయింట్ చేరుతుంది. అప్పుడు ఇరు జట్లూ మొత్తం 9 పాయింట్లతో 2, 3 స్థానాలకు ఎగబాకుతాయి. రెండో ప్లేసులో ఉన్న గుజరాత్ టైటాన్స్ నాలుగో ప్లేసుకు పడిపోతుంది. టాప్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతుండగా.. రెండో స్థానంలో ఆర్సీబీ, మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంటాయి.
తుది జట్లు అంచనా..
ఆర్సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్) / మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంగ్ సింగ్, మార్కో జాన్సెన్, బార్ట్లెట్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్/ యశ్ ఠాకూర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa