ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 07:52 PM

వైఎస్ఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారం కాకరేపుతోంది. ఈ క్రమంలోనే జమ్మలమడుగు శాసనసభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో తనది తప్పుందని తేలితే.. రాజకీయాల నుంచి వైదొలగుతానంటూ ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం వైసీపీకి వత్తాసు పలుకుతోందని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. అందుకే స్థానికుల పక్షాన తాను పోరాడుతున్నట్లు ఆదినారాయణరెడ్డి వివరించారు. సిమెంట్ ఫ్యాక్టరీల యజమానులపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు త్వరలోనే ఫిర్యాదు చేస్తానని తెలిపారు.


మరోవైపు సిమెంట్ ఫ్యాక్టరీలపై జులుం ప్రదర్శిస్తున్నారంటూ ఆదినారాయణరెడ్డిపై ఇటీవలి కాలంలో విమర్శలు వస్తన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలకు అవసరమైన ముడిసరుకు సరఫరా కాంట్రాక్టులతో పాటుగా అన్ని కాంట్రాక్టులూ తనకే ఇవ్వాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే స్థానికుల తరుఫున పోరాడుతున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి చెప్తున్నారు. తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆదినారాయణ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది.


మరోవైపు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల, చిలమకూరుల్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. ఈ సిమెంట్ యూనిట్లు గతంలో ఇండియా సిమెంట్స్ అధీనంలో ఉండేవి. వీటిని అల్ట్రాటెక్ సంస్థ కొనుగోలు చేసింది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ యూనిట్లు అల్ట్రాటెక్ సంస్థ అధీనంలోకి వెళ్లాయి. అయితే ఈ యూనిట్లకు అవసరమైన ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా జరగకుండా ఇటీవల ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి ఫ్లైయాష్‌‌ను ఈ ఫ్యాక్టరీ యూనిట్లకు లారీల ద్వారా రవాణా చేస్తుంటారు. అయితే ఈ లారీలను ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకోవటం వివాదాస్పదమైంది.


ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా నిలిపిపోవటంతో చిలమకూరు ప్లాంట్‌లో సిమెంట్‌ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ఎర్రగుంట్ల ప్లాంట్‌లో కూడా ముడిసరుకు నిండుకోవటంతో సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఫ్లైయాష్‌కు సంబంధించి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డికి కూడా గతంలో విభేధాలు తలెత్తాయి. చివరకు సీఎం చంద్రబాబు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa