అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. రెండు దేశాలు పోటాపోటీగా ఒకదానిపై మరొకటి టారిఫ్ లు విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దని చైనా ఇతర దేశాలను తీవ్రంగా హెచ్చరించింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఒప్పందాలు కుదుర్చుకోవాలని చూస్తే ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది.అమెరికాతో సుంకాలను తగ్గించుకోవడం లేదా మినహాయింపుల కోసం చర్చలు జరుపుతున్న దేశాలు, చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకునేలా అమెరికా (ట్రంప్ ప్రభుత్వం) ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. "చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశం ఒప్పందం చేసుకున్నా దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అలాంటి పరిస్థితి తలెత్తితే, దానిని ఎప్పటికీ అంగీకరించబోమని, కచ్చితంగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని" చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు."స్వప్రయోజనాల కోసం ఇతరుల ప్రయోజనాలను దెబ్బతీయడం పులి చర్మాన్ని కోరుకోవడమే. అది చివరికి విఫలమవుతుంది, ఇతరులకు హాని చేస్తుంది" అని చైనా తన ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఏకపక్షంగా, రక్షణాత్మక విధానాలతో వ్యవహరిస్తోందని, సుంకాలను దుర్వినియోగం చేస్తోందని చైనా ఆరోపించింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యం తమకుందని, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది.ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక మంచి ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ చర్చల విషయాన్ని చైనా ధృవీకరించలేదు. తాము వాణిజ్య యుద్ధాన్ని చివరి వరకు కొనసాగిస్తామని చెబుతూనే, చర్చలకు సిద్ధమని సంకేతాలిచ్చింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ వాణిజ్య వివాదం ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa