జమ్మూకశ్మీర్, అనంతనాగ్ జిల్లాలోని పహెల్గామ్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి చంద్రమౌళి (రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి) మృతి చెందారు. హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న అతనిని వెంటాడి మరీ కాల్చి చంపారు. తనను చంపొద్దని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరించలేదు. విశాఖ నుంచి ఈ నెల 18న జమ్ము కాశ్మీర్కు ఆరుగురు వెళ్లారు. చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు వెళ్లారు. చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు. దీంతో చంద్రమౌళి కుటుంబ సభ్యుల్లో విషాదం అలముకుంది.కాగా జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహెల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసారన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్లో అతి పెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దల్లా పేర్కొన్నారు. సంఘటన స్థలికి కేంద్ర హోమంత్రి అమిత్ షా చేరుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, నిఘా విభాగం డైరెక్టర్ తపన్ డేకాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీరు డీజీపీ నళిన్ ప్రభాత్ పహల్గాం ఉగ్ర దాడి వివరాలను తెలియజేశారు. పహల్గాంలో పరిస్థితిపై ఉన్నతాధికారులతో షా సమీక్షించారు. బుధవారం ఆయన ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. కాగా మృతుల్లో ఇద్దరు విదేశీయులు (ఇజ్రాయెల్, ఇటలీ దేశస్థులు), ఇద్దరు స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa