జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత భయానకంగా సాగింది. తుపాకీ కాల్పుల శబ్దాలు, ఆర్తనాదాల మధ్య పూణేకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ జగ్దాలే కుటుంబం ఒక టెంట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాక్కుంది. ఆ భయానక క్షణాలను ఆయన కుమార్తె ఆశావరి వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. స్థానిక పోలీసుల వంటి దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు కొండపై నుంచి దిగివచ్చి కాల్పులు జరపడం మొదలుపెట్టారని ఆమె తెలిపారు.వెంటనే తాను, తన తల్లి ప్రగతి, తండ్రి సంతోష్ ఇతర పర్యాటకులతో కలిసి సమీపంలోని టెంట్లోకి పరుగులు తీశామని ఆశావరి చెప్పారు. బయట ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయని తాము భావించామన్నారు. కానీ, ఉగ్రవాదులు తామున్న టెంట్ సమీపానికి వచ్చి పక్క టెంట్పై కాల్పులు జరపడంతో భయంతో వణికిపోయామన్నారు. అంతలో, "చౌదరి, బయటకు రా" అంటూ గట్టిగా అరవడంతో తమ గుండె ఆగినంత పనైందని ఆమె వాపోయారు.ఆ తర్వాత ఉగ్రవాదులు తన తండ్రిని టెంట్ నుంచి బయటకు లాగారని, ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నందుకే ఈ దాడి చేస్తున్నామని అన్నారని ఆశావరి తెలిపారు. అక్కడ చాలా మంది పర్యాటకులు ఉన్నప్పటికీ, హిందువులా, ముస్లింలా అని అడిగి మరీ మగవారిని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. "ఇస్లామిక్ ప్రార్థన (కల్మా) చదవాలని మా నాన్నను అడిగారు. ఆయన చదవలేకపోవడంతో తలపై ఒకటి, చెవి వెనుక ఒకటి, వీపులో ఒకటి.. మొత్తం మూడు బుల్లెట్లు కాల్చారు" అని ఆశావరి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన మామయ్య వైపు తిరిగి ఆయనను కూడా కాల్చి చంపారని వివరించారు. దాడి జరిగిన 20 నిమిషాల తర్వాత పోలీసులు, భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa