జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి విమాన ప్రయాణ ఛార్జీలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. విమాన టికెట్ ధరలను విపరీతంగా పెంచవద్దని అన్ని విమానయాన సంస్థలకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఉగ్రదాడి అనంతరం శ్రీనగర్ నుంచి ప్రధాన నగరాలకు విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు టికెట్ ధరలు కొన్ని సందర్భాల్లో రూ. 20,000 దాటాయి. పలు విమానయాన సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో టికెట్లు అమ్ముడైపోయాయని లేదా పరిమిత సంఖ్యలో అధిక ధరలకు అందుబాటులో ఉన్నాయని కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది.శ్రీనగర్ నుంచి పర్యాటకుల సురక్షిత ప్రయాణానికి నిరంతరం కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ఛార్జీలు పెంచకుండా ఉండేందుకు విమానయాన కంపెనీలకు కఠిన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఛార్జీలను పర్యవేక్షిస్తూ సహేతుకమైన స్థాయిలో ఉండేలా చూస్తున్నట్లు వెల్లడించారు.పర్యాటకుల సౌకర్యార్థం, చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు అదనపు విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఆయన ధృవీకరించారు. తొలుత ఢిల్లీ, ముంబైలకు చెరో రెండు చొప్పున మొత్తం నాలుగు అదనపు విమానాలను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa