ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో మూడు ఎలివేటెడ్ కారిడార్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 07:26 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా దాదాపు రూ.లక్ష కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాజధానిలో మూడు ప్రధాన రహదారుల్లో (మేజర్‌ ఆర్టీరియల్‌ రోడ్స్‌) 8 వరుసల ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు డీపీఆర్ తయారు చేసేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లను ఆహ్వానించింది.


రాష్ట్ర రాజధాని అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానించే ఇ5, ఇ13, ఎన్‌13 రోడ్లను చేపట్టింది ప్రభుత్వం. ఇ-13 రోడ్డును చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16ను అనుసంధానించేందుకు ఏడీసీ ఈ టెండర్లు పిలిచింది. అమరావతికి సంబంధించి ఎన్‌-13 రోడ్డుకు కొనసాగింపుగా కృష్ణా నదిపై రాయపూడి దగ్గర ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మిస్తారు. ఇది ఎన్టీఆర్‌ జిల్లాలో మూలపాడు దగ్గర మచిలీపట్నం-హైదరాబాద్‌ హైవేతో కలుస్తుంది. ఇ-5 రోడ్డును చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16తో లింక్ చేసేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ మూడు రోడ్లను నేషనల్ హైవేలకు అనుసంధానం చేస్తూ ఎలివేటెడ్‌ కారిడార్‌ల నిర్మాణం చేయనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పీవీ నరసింహారావు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో వీటిని నిర్మించనున్నారు. అయితే గతంలోనే వీటి డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించారు.. కానీ ఒకే బిడ్ రావడంతో మరోసారి టెండర్లను పిలిచారు అధికారులు


మరోవైపు ప్రధాని మోదీ అమరావతిలో హాజరయ్యే సభ కోసం మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేదిక మీద 30 మంది రాజధాని రైతులు, మహిళలతో పాటుగా రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తారు. ఈ సభకు మొత్తం 5 లక్షలమంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు.. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ హెలిప్యాడ్‌ నుంచి సభావేదిక వరకు 1.1 కి.మీ. మేర రోడ్‌ షో నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన రోజు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా విజయవాడ పశ్చిమ బైపాస్‌ నుంచి కూడా రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మే2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభాప్రాంగణం దగ్గరకు వస్తారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సభ ఉంటుంది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa