ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్ దాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిచర్యగా ఈ నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 07:54 PM

భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాల నాటి ద్వైపాక్షిక సంబంధాలను నిర్వచించిన చారిత్రక సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పాకిస్థాన్ గురువారం సంచలన ప్రకటన చేసింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామాబాద్ పేర్కొంది. 1971 నాటి ఇండో-పాక్ యుద్ధం అనంతరం ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది.1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదపడిన తర్వాత, ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలను పునరుద్ధరించేందుకు సిమ్లా ఒప్పందం మార్గం సుగమం చేసింది. 1972 జులై 2న హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తలెత్తే వివాదాలను శాంతియుతంగా, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది ఈ ఒప్పందంలోని కీలక సూత్రం. మూడో పక్షం జోక్యాన్ని ఇది నివారిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, 1971 నాటి కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖ లైన్ అఫ్ కంట్రోల్ - ఎల్ఓసీ గా గుర్తించి, దానిని ఏకపక్షంగా మార్చరాదని ఇరు దేశాలు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని, పరస్పర ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని కూడా ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు.పాకిస్థాన్ ప్రకటనపై భారత్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. సిమ్లా ఒప్పందం సస్పెన్షన్ తక్షణమే క్షేత్రస్థాయిలో పెద్ద మార్పులు తీసుకురాకపోయినా, భవిష్యత్తులో దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలు పెరిగేందుకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa