ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉర్సా' భూములు కేటాయించిన పద్దతి కుంభకోణం కాదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 29, 2025, 12:38 PM

కూటమి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టిన 'ఉర్సా' మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారుచౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే 'ఉర్సా' ఆవిర్భవించిందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్ళడానికి ముందు నెలలోనే 'ఉర్సా' కంపెనీ రిజిస్టర్ అయ్యిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్‌ చేసిన రెండు నెలల్లోనే వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఆఘమేఘాల మీద ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది భారీ కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ..... ఐటీ మంత్రి నారా లోకేష్‌ 2024 అక్టోబర్‌లో అమెరికాలో పర్యటించారు. సరిగ్గా ఆయన పర్యటనకు ముందు నెల అంటే 2024 సెప్టెంబర్ 27న అమెరికాలో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థను ఎన్‌ఆర్‌ఐ ప్రమోటర్లు కౌశిక్ పెందుర్తి, సతీష్‌ అబ్బూరిలు  రిజిస్టర్ చేశారు. దీనికి అనుబంధ సంస్థగా ఇండియా ఉర్సా క్లస్టర్స్ పైవేట్ లిమిటెడ్ ను 2025 ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయంను హైదరాబాద్‌లోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో చూపించారు. అమెరికాలోనూ ఒక సాధారణ ఇంట్లో ఈ సంస్థ అంతర్జాతీయ కార్యాలయం ఉంది. ఈ సంస్థకు సంబంధించి ఏ సామర్థ్యంను చూసి ఇన్ని వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఇంత విలువైన భూములను కేటాయించేందుకు చకచక ఫైళ్ళు పరుగులు తీయించడం వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారు. తన బినామీలకు కేటాయించేందుకే ఎటువంటి నిబంధనను పాటించలేదు. ఉర్సా భూముల కుంభకోణంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే, సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, పరిశ్రమలశాఖమంత్రి ఎందుకు స్పందించడం లేదు? ఉర్సా పేరుతో ఒక సూట్‌కేస్ కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములను అతి తక్కువ రేటుకే అప్పగిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు. గజం రూ.30 వేలు పలుకుతున్న విశాఖ కాపులుప్పాడు భూములను రూ.50 లక్షలకు ఎలా విక్రయిస్తున్నారు? దీనిలో మతలబు ఏమిటీ? ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంటే చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూములను ఎలా విక్రయిస్తారు? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa