గుజరాత్ టైటాన్స్పై ఇటీవల అద్భుత శతకంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వైభవ్ను ఇప్పుడే అతిగా పొగడవద్దని, అతడు నేర్చుకోవాల్సి చాలా ఉందని పేర్కొన్నాడు. ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరుగుతుండగా కామెంటరీ బాక్స్లో ఉన్న సునీల్ గవాస్కర్.. వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్ వేలానికి ముందే యూత్ టెస్టులో ఆస్ట్రేలియాపై శతకం సాధించాడు. 13 ఏళ్ల వయసులో అంతర్జాతీయ జట్టుపై సెంచరీ చేయడం చిన్న విషయం కాదు. అతడిలో ప్రతిభ ఉంది, కానీ ఇంకా పూర్తిగా రాటుదేలలేదు. తన ఆటను మరింత మెరుగుపరుచుకోవాలి. ద్రవిడ్ వంటి వారి మార్గదర్శకత్వంలో అతడు మరింత అభివృద్ధి చెందుతాడు’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.అదే సమయంలో సూర్యవంశీపై అప్పుడే ప్రశంసలు సరికాదని గవాస్కర్ హెచ్చరించాడు. ‘తొలి మ్యాచ్లో మొదటి బంతికే సిక్స్, మూడో మ్యాచ్లో సెంచరీ చూసి అనుభవజ్ఞులైన బౌలర్లు అతడిని తేలికగా అంచనా వేయరు. ‘మొదటి బంతికే సిక్స్ కొడతాడేమో’ అని భావించి షార్ట్ లెంగ్త్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల వైభవ్ ఔటయ్యే ప్రమాదం ఉంది. అలా జరిగితే అతను ఒత్తిడికి లోనై, అతిగా ఆలోచించే అవకాశం ఉంది’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa