ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే.. వచ్చే ఏడాదే స్టార్ట్.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 08:34 PM

రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ శుభవార్త అందింది. అమరావతిలో అత్యాధునిక క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానుంది. భారతదేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు కానుంది.అమరావతి కేంద్రంగా 2026 జనవరి ఒకటో తేదీ నుంచి క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఏపీ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎల్అండ్‌టీ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుంది.


క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం చేసుకున్న ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాదు., భారతదేశానికి కూడా చరిత్రాత్మకం అని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. క్వాంటమ్ కంప్యూటింగ్ నూతన ఆవిష్కరణలకు, భవిష్యత్ పాలనకు పునాది అవుతుందన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న చంద్రబాబు నాయుడు.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. నేటి యువత ఎప్పటికప్పుడు వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ అవసరాలన్నీ ఈ టెక్నాలజీలపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతి క్వాంటం వ్యాలీ తీర్చిదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించింది. ఇప్పటికే ఈ ప్రాంతానికి వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ఐబీఎం ద్వారా రూపొందించిన ల్యాండ్‌ మార్క్‌ ఐకానిక్‌ భవనం ఏర్పాటు కానుంది. క్వాంటం కంప్యూటింగ్‌ అవసరాల కోసం ప్రత్యేక ఆన్‌లైన్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రాజెక్టు వేగంగా అమలయ్యేలా చూడాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం జరిగింది. అనంతరం పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa