ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 నెలలకు సరిపడా ఆహారం, మందులు నిల్వ చేసుకోండి

national |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 09:21 PM

పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య కశ్మీర్ కోసం గొడవ జరుగుతుండగా.. అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ సమస్యను పూర్తిగా తొలగించుకోవాలని అనేక దేశాలు సూచిస్తున్నాయి. అందుకోసం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని వివరిస్తున్నాయి. అప్పుడే సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని సలహాలు ఇస్తున్నారు అనేక మంది నేతలు. ఈక్రమంలోనే భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో.. ప్రజలు ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను పీవోకే యంత్రాంగం అప్రమత్తం చేసింది.


భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న 13 నియోజక వర్గాల ప్రజలకు రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని సూచనలు చేసినట్లు చౌధ్ర అన్వర్ ఉల్‌హక్‌ స్థానిక అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు. అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు అన్వర్ ఉల్‌హక్‌ తెలిపారు.


స్వాతంత్రం వచ్చి దేశ విభజన జరిగిన తొలి నాళ్లలోనే కశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది పాకిస్థాన్. నియంత్రణలోకి అయితే తీసుకుంది కానీ ఎప్పుడూ ఆ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదు. భారత దేశంపై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు మాత్రమే పీవోకేను ఉపయోగించుకుంది. పీవోకేను అభివృద్ధి చేయాలని అభిప్రాయం కానీ, ఉద్దేశం కానీ పాకిస్థాన్‌కు ముందు నుంచే లేవు.


పీవోకే ప్రధాన మంత్రి పీఠం అధిరోహించినవారు ఇస్లామాబాద్ సర్కారు చేతుల్లో కీలు బొమ్మగానే మిగిలిపోతున్నారు. ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరవు అవుతోంది. దివాళ అంచున ఉన్న పాకిస్థాన్‌ను స్థానిక తిరుగుబాట్లు, వరుస ఉగ్రదాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్ అనుకూలవాదం బలంగా వినిపిస్తోంది.


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ ఇటీవల మాట్లాడుతూ.. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా పరిష్కరించడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారంగా చెప్పుకొచ్చారు. ఉగ్రవాద చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. భారత్ కఠినంగా జవాబు ఇవ్వాలని సూచించారు. కశ్మీర్ వివాదంలో ఈ ఘటనే చివరిది కావాలని ఆయన అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa