కర్ణాటక స్పీకర్ యుటీ ఖాదర్కు హత్యా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. నాక్కూడా బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని.. దానికి నేనేం చేయాలని ప్రశ్నించారు. ఇప్పటికే పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశానని.. నిందితులను పట్టుకోవాలని సూచించినట్లు వివరించారు. ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మండ్యలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో పాల్గొన్ని సీఎం సిద్ధరామయ్య షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా స్పీకర్ యూటీ ఖాదర్కు హత్యా బెదిరింపు కాల్స్ వచ్చాయంట కదా అని ప్రశ్నించగా.. నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. నేనేం చేయాలని మీడియా ప్రతినిధులనే తిరిగి ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నారనో తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు సూచించినట్లు వెల్లడించారు. అలాగే మంగళూరులో ఇటీవల జరిగిన బజరంగ్ దళ్ సభ్యుడు సుహాస్ శెట్టి హత్యను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
అయితే సుహాస్ శెట్టి రౌడీ షీటర్ అని చెబుతున్నారని.. దాన్ని తనిఖీ చేయాలని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. హత్య జరిగిన తర్వాత తాను పోలీసులతో మాట్లాడానానని... అలాగే మంగళూరు ఏడీజీపీకి లా అండ్ ఆర్డర్ పంపామని వెల్లడించారు. ఈ క్రమంలోనే పోలీసులు బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించినట్లు వివరించారు. అయితే హత్య ప్లాన్ ప్రకారమే జరిగింది లేదా అనేది దర్యాప్తు పూర్తయిన తర్వాతే తెలుస్తుందన్నారు. బీజేపీ ఇంలాంటి ఘటనలను రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కాషాయదళ నాయకులు ఎప్పుడూ ఇలాంటి ఘటనల కోసమే వెతుకుతుంటారని.. దొరికిన వెంటనే దానిపై రాజకీయాలు చేయడం ప్రారంభిస్తారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడిలో మొత్తంగా 26 మంది మరణించడంపై సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. భద్రతాఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ మారణహోమం జరిగిందని అన్నారు. అసలు దాడి సమయంలో అక్కడ పోలీసులు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఉగ్రవాద దాడి జరిగిన సమయంలో ఒక్క పోలీసు, ఒక్క భద్రతా సిబ్బంది కూడా లేరని తనకు తెలిసిందని.. అసలు భద్రత లేకపోవడం వెనుక అంతరార్థం ఏంటని సీఎం సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa