భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఊహించని ట్విస్ట్! రద్దీని నియంత్రించేందుకు, కన్ఫర్మ్డ్ టికెట్లు కలిగిన వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించే లక్ష్యంతో, 2025 మే 1 నుంచి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టిక్కెట్లతో స్లీపర్ లేదా ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) కోచ్లలో ప్రయాణించడానికి అనుమతిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి రావడంతో, వేలాది మంది ప్రయాణికులకు ఇది కొత్త తలనొప్పిగా మారనుంది.
ఇకపై ఆన్లైన్లో లేదా నేరుగా రైల్వే కౌంటర్లలో కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు కలిగిన ప్రయాణికులు కేవలం సాధారణ (రిజర్వ్ చేయని) కోచ్లలో మాత్రమే ప్రయాణించడానికి అర్హులు. ఒకవేళ ఎవరైనా రిజర్వ్డ్ స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణిస్తూ టికెట్ తనిఖీ సమయంలో దొరికితే.. వారికి భారీ జరిమానాలు విధించనున్నారు. స్లీపర్ క్లాస్లో ప్రయాణిస్తే రూ. 250 వరకు, ఏసీ క్లాస్లో ప్రయాణిస్తే రూ. 440 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, వారు ప్రయాణం ప్రారంభించిన స్టేషన్ నుంచి తర్వాతి స్టేషన్ వరకు ఛార్జీని కూడా అదనంగా వసూలు చేస్తారు.
ఈ నిబంధనలను కఠితంగా అమలు చేయడానికి ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు కలిగి ఉండి, తర్వాతి స్టేషన్లలో రిజర్వ్డ్ కోచ్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ప్రయాణికులను రైలు నుంచి దించివేసి జరిమానా విధించే అధికారం వారికి ఉంటుంది.
ఇక 60 రోజులే టైమ్.. ఓటీపీ తప్పనిసరి..!
కేవలం ప్రయాణ నియమాల్లోనే కాకుండా, టికెట్ బుకింగ్ ప్రక్రియలో కూడా భారతీయ రైల్వే కీలక మార్పులు చేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ను గణనీయంగా తగ్గించింది. గతంలో 120 రోజుల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై ప్రయాణ తేదీకి కేవలం 60 రోజుల ముందు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోగలరు. దీంతో ఆకస్మిక ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారికి ఇది కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. భద్రతా చర్యల్లో భాగంగా, ఆన్లైన్ టికెట్ కొనుగోలు ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. ఇకపై ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా వన్-టైమ్ పాస్వర్డ్ ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధనల అమలుతో, కన్ఫర్మ్డ్ టిక్కెట్లు కలిగిన ప్రయాణికులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్డ్ కోచ్లలో తరచుగా తలెత్తే రద్దీ సమస్యను అధిగమించడానికి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ఈ చర్యలు తప్పవని వారు సమర్థిస్తున్నారు. అయితే, కన్ఫర్మ్డ్ టిక్కెట్లు పొందలేని సాధారణ ప్రయాణికులకు ఇది ఒక పెద్ద సవాలుగా మారనుంది. వారు ఇకపై తమ ప్రయాణాన్ని సాధారణ కోచ్లలోనే కొనసాగించాల్సి ఉంటుంది, అక్కడ సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి.
కాబట్టి, మీరు రైలులో స్లీపర్ లేదా ఏసీ క్లాస్లో ప్రయాణించాలని యోచిస్తున్నట్లయితే, మీ టికెట్ ప్రయాణ తేదీకి ముందే కన్ఫర్మ్ అయిందో లేదో తప్పకుండా తెలుసుకోండి. ఒకవేళ మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే, మీరు సాధారణ కోచ్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కొత్త నిబంధనల గురించి మరింత సమాచారం కోసం భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa