మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో నిత్యవసరంగా మారింది. చేతిలో మొబైల్ లేకుండా ఇంటి గడప దాటే పరిస్థితులు లేవు. అయితే మొబైల్ ఫోన్ను అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అతిగా వినియోగిస్తే.. నష్టాలు కూడా ఆ స్థాయిలోనే కలుగుతాయి. పిల్లలు,పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద మొబైల్ దుష్ప్రభావాలు చూపిస్తుంది.
దాని నుంచి వెలువడే రేడియేషన్ మన మానసిక, శారీరక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. రోజుకు 12 గంటల పాటు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల ఓ యువకుడు పక్షవాతం బారిన పడ్డాడు. వెన్నెముక కూడా వంగిపోయింది. ఆ వివరాలు..
ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల యువకుడికి తాజాగా వెన్నెముక ఆపరేషన్ చేశారు. కారణం సదరు యువకుడు రోజుకు సుమారు 12 గంటల పాటు మొబైల్ ఫోన్లో పబ్జీ వంటి గేమ్స్ ఆడుతూ తన గదికే పరిమితం అయి ఉండేవాడు. అలా కాలం గడుస్తున్న కొద్ది ఈ మొబైల్ గేమింగ్ అలవాటు అతడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపసాగింది. కొన్నాళ్లకు ఆ యువకుడు బ్లాడర్ మీద నియంత్రణ కోల్పోయాడు. అది కాస్త వెన్నెముక మీద ప్రభావం చూపింది. అలా ఏడాది గడిచేసరికి అతడి ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించి చివరకు నడవలేని.. కనీసం మూత్ర విసర్జన కూడా చేయలేని స్థితికి వచ్చాడు.
అతడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు.. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. వెన్నెముక సమస్య కావడంతో.. అతడిని ఇండియన్ స్పైనల్ ఇంజ్యూరీస్ సెంటర్(ఐఎస్ఐసీ)కి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆ యువకుడి పరిస్థితిని గమనించి.. అతడు తీవ్రమైన కైఫో స్కోలియోసిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అంటే ఈ పరిస్థితిలో వెన్నెముక ముందు భాగం, రెండు పక్కల వంగిపోయి ఉంటుంది.
స్కాన్లో యువకుడి రెండు వెన్ను ఎముకలు(డీ11, డీ12) ఇన్ఫెక్షన్కు గురయ్యి.. చీమును ఉత్పత్తి చేశాయని.. అంతేకాక వెన్నెముక మీద భారం పడి అది వంగిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎస్ఐసీ ముఖ్య వైద్యుడు ఒకరు మాట్లాడుతూ.. ఇది అడ్వాన్స్డ్ స్పైనల్ టీబీ. ఇది అత్యంత చాలేంజింగ్ కేసు. గంటల తరబడి మొబైల్లో గేమ్స్ ఆడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది అని వెల్లడించారు.
ఈ కేసు చికిత్స కోసం వైద్యులు స్పైనల్ నావిగేషన్ టెక్నాలజీని వినియోగించారు. యువకుడికి శస్త్ర చికిత్స చేసి అతడి స్పైనల్ కార్డ్, దాని పరిమాణాన్ని సరి చేసి.. అది స్థిరంగా ఉండేలా చేశారు. సర్జరీ ముగిసిన కొన్ని రోజుల తర్వాత.. యువకుడు నెమ్మదిగా కోలుకోసాగాడు. బ్లాడర్ మీద తిరిగి నియంత్రణ సాధించాడు, తిరిగి నెమ్మదిగా నడవసాగాడు. ప్రస్తుతం అతడికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. త్వరలోనే అతడి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు వైద్యులు.
మొబైల్ ఫోన్లు వాడుతున్న యువతలో ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం, మొబైల్ చూసే సమయంలో శరీరం పోశ్చర్ సరిగా లేకపోవడం వల్ల చాలా మందిలో ఎముకలు, కీళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి అని వెల్లడించారు వైద్యులు. అంతేకాక తల్లిదండ్రులు కూడా పిల్లలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలని.. మొబైల్ ఫోన్ వినియోగంలో కట్టడి చేయాలని.. లేదంటే సమస్య తీవ్ర రూపం దాల్చి ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఇక మొబైల్ అతి వినియోగం వల్ల కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉందంటున్నారు వైద్యులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa