ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై విమానాలన్నీ ఆ దారిలోనే..అమెరికాకు రూటు మార్చుకుంటున్న ఎయిర్ ఇండియా

national |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 09:24 PM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ ఇరు దేశాలు తమ గగనతలంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని వల్ల భారత్ నుంచి అమెరికాకు వెళ్లాల్సిన విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల ఎయిరిండియా నష్టాలు చవిచూసింది. ఈ నష్టాల నుంచి బయట పడటానికి ఎయిర్ ఇండియా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తమ దారిని మార్చుకుని అమెరికాకు వెళ్లి.. ఖర్చును తగ్గించుకోబోతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.


దిల్లీ నుంంచి ఉత్తర అమెరికా నగరాలకు వెళ్లే విమానాలకు, ప్రత్యామ్నాయ మార్గాలను ఎయిర్ ఇండియా అన్వేషిస్తోంది. దిల్లీ నుంచి దేశంలోని మరో నగరానికి వచ్చి, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇలా చేయడం ద్వారా పాకిస్థాన్ గగనతలాన్ని వాడుకోకుండానే తక్కువ ఖర్చుతో అధిక దూరం ప్రయాణించే వీలు ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం వారానికి 71 విమానాలను ఉత్తర అమెరికాకు ఎయిరిండియా నడుపుతోంది. అందులో 54 సర్వీసులు దిల్లీ నుంచే వెళ్తున్నాయి.


'ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం. విదేశీ టెక్-స్టాప్స్ సంఖ్య తగ్గించడం, మరిన్ని నాన్-స్టాప్ సర్వీసులను త్వరలోనే పెంచుతాం' అని ఎయిరిండియా ఎండీ, సీఈవో తమ సిబ్బందికి తాజాగా సమాచారం పంపించారు. అమెరికా వెళ్లే విమాలు అన్నీ అరేబియా సముద్రం మీదుగా, సుదీర్ఘ మార్గాల్లో వెళ్తున్నాయి. దీని వల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు, ఇంధనం కూడా అధికంగా ఖర్చు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.


దిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలను, ముంబయి లేదా అహ్మదాబాద్‌ను టెక్నికల్ స్టాప్‌గా తీసుకోవాలని భావిస్తోంది ఎయిరిండియా. ఇలా చేయడం ద్వారా ఐరోపా నగరాల్లో ఆపాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల ప్రయాణ సమయం, ఇంధన ఆదా అవుతుంది. పాకిస్థాన్ గగనతలం మూసివేత వల్ల ఏడాదికి 600 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.5,200 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఎయిరిండియా అంచనా వేసింది. ఈ ఉద్రిక్తతల వల్ల భారతీయ విమానయాన కంపెనీలకు నెలకు రూ.306 కోట్ల అదనపు వ్యయాలు అవ్వొచ్చని అంచనా.


పాక్ తన గగనతలాన్ని కేవలం భారత విమానయాన సంస్థలకు మాత్రమే మూసివేసింది. విదేశీ విమానయాన సంస్థలు ఎప్పట్లాగే పాక్ గగనతలాన్ని వాడుకోవచ్చు. కానీ భారత్‌కు సేవలు అందించే ఇతర దేశాల విమానయాన సంస్థలు కూడా పాక్ గగనతలాన్ని వాడుకోకుండా ఉండేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. దీని వల్ల పాక్‌ గగనతలాన్ని వాడుకుంటున్నందుకు ఆ దేశానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయలను పాక్ కోల్పోతోంది. 2019 ఫిబ్రవరిలోనూ భారత్‌తో వివాదం నేపథ్యంలో, గగనతలంపై నిషేధం విధించింది పాక్. కేవలం 5 నెలల కాలంలో ఏకంగా 10 కోట్ల డాలర్లు కోల్పోయింది పాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa