ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టికెట్ ధరలు రెట్టింపు, బస్ పాస్‌లపైనా వడ్డింపు

national |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 09:22 PM

మహారాష్ట్ర రాజధాని ముంబైలో బస్ ఛార్జీలు, బస్ పాస్‌ ధరలు భారీగా పెరిగాయి. చివరిసారిగా ముంబైలో 2018లో బస్ ఛార్జీలను పెంచగా.. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత పెంచినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్-బెస్ట్ బస్సు ఛార్జీల పెంపునకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ముంబై నగరంలో నిత్యం ప్రయాణించే 31 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితం కానున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థకు నష్టాలు పెరుగుతున్నాయనే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో శుక్రవారం భేటీ నిర్వహించిన తర్వాత బృహన్ ముంబై కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రాని ఈ బస్సు ఛార్జీలు, బస్ పాస్‌ల పెంపునకు ఆమోదం కల్పించారు.


బెస్ట్ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి కారణంగా ఛార్జీల పెంపు అనివార్యమని అధికారులు ధృవీకరించారు. కనిష్ఠ ఛార్జీ చాలా కాలంగా రూ.5 ఉందని.. దీని వల్ల సంస్థకు వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని బెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ఛార్జీల పెంపునకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఎమ్ఎమ్ఆర్టీఏ) నుంచి ఇంకా తుది ఆమోదం రానప్పటికీ.. బీఎంసీ, బెస్ట్ అధికారులు మాత్రం వీలైనంత త్వరగా కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఛార్జీల పెంపు తర్వాత నాన్ ఏసీ బస్సుల కనిష్ట ఛార్జీ రూ.5 నుంచి రూ. 10కి పెరగనుంది. ఇక ఏసీ బస్సుల కనీస ఛార్జీ రూ. 6 నుంచి రూ. 12కి పెంచనున్నారు. దీంతో ఈ రెండు టికెట్లు ఒకేసారి రెట్టింపు అయ్యాయి. ఇక గత 10 ఏళ్లలో బెస్ట్ సంస్థకు బీఎంసీ రూ. 11 వేల కోట్లకు పైగా సబ్సిడీలను అందించింది. అయినప్పటికీ బెస్ట్ సంస్థకు నష్టాలు వస్తూనే ఉన్నాయి. తమకు కేటాయించిన బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఇకపై బెస్ట్‌కు ఆర్థిక సహాయం అందించలేమని బీఎంసీ తేల్చి చెప్పగా.. ఛార్జీల పెంపు మాత్రమే అందుకు ప్రత్యామ్నాయమని గుర్తించి.. ఈ నిర్ణయం తీసుకున్నారు.


కొత్త ఛార్జీల ప్రకారం.. 0-5 కిలోమీటర్ల వరకు నాన్ ఏసీ బస్సు ఛార్జీలు రూ. 10.. 5-10 కిలోమీటర్ల నుంచి 10-15 కిమీ పరిధిలో ఛార్జీలు రూ. 15 నుంచి రూ. 20కి పెరిగాయి. ఇక 15-20 కిలోమీటర్ల నుంచి 20-25 కిలోమీటర్ల పరిధిలో ఛార్జీలు రూ. 30 నుంచి రూ. 35కి పెరిగాయి. అదే సమయంలో ఏసీ బస్సుల సవరించిన ఛార్జీలు 0-5 కిలోమీటర్ల నుంచి 20-25 కిలోమీటర్ల వరకు వరుసగా రూ. 12, రూ. 20, రూ. 30, రూ. 35, రూ. 40గా వసూలు చేయనున్నారు. మరోవైపు.. 5 కిలోమీటర్ల పరిధిలోని వీక్ బస్ పాస్ ధరలు రెట్టింపు అయ్యాయి. గతంలో రూ.70 ఉండగా.. రూ. 140కి చేరాయి. 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల పరిధికి బస్ పాస్‌ల ధరలు రూ. 210, రూ. 420గా ఉన్నాయి.


నాన్ ఏసీ బస్సుల నెలవారీ పాస్ ధరలు 5 కిలోమీటర్లు.. 10 కిలోమీటర్లు.. 20 కిలోమీటర్లు పరిధిలో రూ. 800, రూ. 1250, రూ. 2600గా ఉండగా వసూలు చేస్తున్నారు. ఇక ఇదే దూరానికి ఏసీ బస్సులకు రూ. 1100, రూ. 1700, రూ. 3500కి పెంచారు. ముంబై నగర పరిధిలో బస్సుల నెట్‌వర్క్‌ను మరింత పెంచడానికి.. బెస్ట్ సంస్థ నష్టాల బారి నుంచి బయటికి రావడానికి ఛార్జీల పెంపు అవసరమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బస్ ఛార్జీల పెంపు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం మోపుతుందని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019లో అప్పటి బృహన్ ముంబై కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పరదేశి ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి బస్సు ఛార్జీలను తగ్గించడానికి నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు దానికి విరుద్ధంగా బస్ ఛార్జీలను పెంచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa