ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్బీఐకి బిగ్ షాక్.. లాభం భారీగా తగ్గినా.. వడ్డీతో 3 నెలల్లోనే రూ. లక్ష కోట్లకుపైగా

business |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 11:36 PM

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా త్రైమాసిక ఫలితాలు కాస్త నిరాశపరిచాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఎస్‌బీఐ స్టాండలోన్ ప్రాతిపదికన రూ. 18,642.59 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 10 శాతం తక్కువ కావడం గమనార్హం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 20,698 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే, నికర లాభంలో క్షీణత ఉన్నప్పటికీ, బ్యాంక్ ఆదాయంలో మాత్రం వృద్ధి కనబరిచింది.


ఈ జనవరి- మార్చి సమీక్షా త్రైమాసికంలో ఎస్‌బీఐ మొత్తం రూ. 1,43,876 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 1,28,412 కోట్లుగా ఉంది. ఇక వడ్డీ ఆదాయం విషయానికి వస్తే, జనవరి-మార్చి మధ్య బ్యాంక్ రూ. 1,19,666 కోట్లు ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 1,11,043 కోట్ల కంటే ఎక్కువ. ఇక ఫలితాలకు ముందు రోజు అంటే శుక్రవారం రోజు ఎస్బీఐ షేర్ ధర 1.41 శాతం పెరిగి రూ. 800 కు సమీపంలో ముగిసింది. అంతకుముందు మాత్రం ఎస్బీఐ స్టాక్ పడిపోయింది.


  ఎస్బీఐ డివిడెండ్ ప్రకటన..


లాభాలు తగ్గినా.. డివిడెండ్‌‌తో మాత్రం ఎస్‌బీఐ తన వాటాదారులను సంతోషపరిచింది. ఒక్కో షేరుకు ఏకంగా రూ. 15.90 డివిడెండ్‌ను ప్రకటించింది. ఇది ఒక్కో షేరుపై 1590 శాతం డివిడెండ్ కావడం విశేషం. ఈ డివిడెండ్‌కు అర్హులైన వాటాదారులను గుర్తించడానికి రికార్డు తేదీని మే 16గా నిర్ణయించారు. డివిడెండ్ చెల్లింపు మే 30న జరుగుతుంది.


మరోవైపు, బ్యాంక్ ఆస్తుల నాణ్యత మాత్రం మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు  2.24 శాతం నుంచి 1.82 శాతానికి తగ్గాయి. అలాగే, నికర నిరర్థక ఆస్తులు కూడా 0.57 శాతం నుంచి 0.47 శాతానికి తగ్గుముఖం పట్టాయి. ఇది బ్యాంక్ పనితీరులో సానుకూల అంశం. ఏకీకృత ప్రాతిపదికన చూస్తే, ఎస్‌బీఐ నికర లాభం 8 శాతం తగ్గి రూ. 19,600 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 21,384 కోట్లుగా ఉంది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం రూ. 1.64 లక్షల కోట్ల నుంచి రూ. 1.79 లక్షల కోట్లకు పెరిగింది.


మొత్తం ఆర్థిక సంవత్సరం (2024-25) విషయానికి వస్తే, స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ. 70,901 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం నమోదైన రూ 61,077 కోట్ల కంటే 16 శాతం ఎక్కువ. మొత్తానికి, ఎస్‌బీఐ నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో క్షీణతను చవిచూసినప్పటికీ, ఆదాయంలో వృద్ధిని నమోదు చేసింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడటం శుభసూచకం. అంతేకాకుండా, భారీ డివిడెండ్‌ను ప్రకటించడం ద్వారా బ్యాంక్ తన వాటాదారుల్ని సంతోషపరిచింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa