ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఎంఎఫ్ బోర్డు సభ్యుడి తొలగింపు,,,కేంద్రం షాకింగ్ నిర్ణయం..

national |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 09:27 PM

అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు సభ్యుడిగా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. యన పదవీకాలం మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. ఐఎంఎఫ్ బోర్డు కీలక సమావేశానికి కొద్ది రోజుల ముందే ఈ చర్య తీసుకుంది. ఆ సమావేశంలో పాకిస్థాన్‌కు కొత్తగా 1.3 బిలియన్ డాలర్లు ఉద్దీపన రుణాన్ని మంజూరు చేయాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకోనుంది. పహల్గామ్ దాడి అనంతరం పాకిస్థాన్‌ ఆర్ధిక మూలాలను భారత్ దెబ్బకొట్టి.. దాయాదిని అష్టదిగ్భంధనం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం అందకుండా చర్యలు చేపడుతోంది. ఇదే సమయంలో ఐఎంఎఫ్ రుణం కూడా దాయాదికి అందకుండా చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ఫిర్యాదు చేసిన భారత్.. త్వరలో జరగబోయే సమావేశంలో రుణం మంజూరు ఆమోదం పొందకుండా ప్రయత్నాలు చేస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


తనను ఐఎంఎఫ్ బోర్డు సభ్యుడిగా తొలగించడంపై సుబ్రమణియన్ ఇంకా స్పందించలేదు. ప్రధాని మంత్రి మాజీ ఆర్థిక సలహాదారు అయిన కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఐఎంెఫ్ డేటాసెట్‌లపై ప్రశ్నలు లేవనెత్తడంతోనే ఆయనను సభ్యుడిగా తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐఎంఎఫ్‌తో ఆయనకు గతంలోనూ కొనసాగిన విబేధాలు కూడా కారణం కావచ్చని తెలుస్తోంది. ఇటీవల ‘India @100: Envisioning Tomorrow's Economic Powerhouse’ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో ఐఎంఎఫ్‌పై ఆరోపణలు చేశారు. సుబ్రమణియన్ ప్రస్తుతం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.


ఆయన స్థానంలో జూన్ చివర్లో పదవీ విరమణ చేయనున్న ఆర్థిక కార్యదర్శి అజయ్ సేథ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మూడేళ్ల పదవీకాలానికి నవంబర్ 2022లో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టారు. భారత ప్రభుత్వం ఇండియా, భూటాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు ఒక సంయుక్త ప్రతినిధిని ఐఎంఎఫ్ బోర్డుకు నామినేట్ చేస్తుంది.


అధికారిక వెబ్‌సైట్‌లో ఐఎంఎఫ్ పేర్కొన్న ప్రకారం.. హరిశ్చంద్ర పహత్ కుమ్బురే గెదరా ప్రస్తుతం ఆల్టర్నేట్ డైరెక్టర్‌గా ఉన్నారు. గతంలోనూ సుబ్రమణియన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఐఎంఎఫ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌ పదవీకాలం 2021లో ముగిసింది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవస్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో భారత భూభాగంలోకి చొరబడిన పాకిస్థాన్ రేంజర్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అదుపులోకి తీసుకుంది. పాక్ రేంజర్‌ను రాజస్థాన్‌లోని భారత-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa