ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సరిహద్దుల్లోకి ప్రవేశించి.. బీఎస్ఎఫ్‌కు చిక్కిన పాకిస్థాన్ సైనికుడు

national |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 09:29 PM

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడితో సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్తాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో భారత భూభాగంలోకి చొరబడిన పాకిస్థాన్ రేంజర్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అదుపులోకి తీసుకుంది. పాక్ రేంజర్‌ను రాజస్థాన్‌లోని భారత-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్‌లోని ఏప్రిల్ 22న 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఉగ్రదాడి ఘటనతో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ రేంజర్‌ను బీఎస్ఎఫ్ రాజస్థాన్ ఫ్రంటియర్ అధికారులు అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. అతడి వివరాలు ఏంటి? అనేది మాత్రం వెల్లడించలేదు. అరెస్ట్ సమయంలో అతడి నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదని అధికారులు తెలిపారు. పాక్ రేంజర్ గూఢచర్యం కోసమే భారత భూభాగంలోకి వచ్చాడా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.


ఏప్రిల్ 23న పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా‌ ప్రస్తుతం పాకిస్థాన్ చెరలో ఉన్న విషయం తెలిసిందే. అతడ్ని వదిలిపెట్టాలని భారత బలగాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ, పాక్ మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పైస్థాయిలో అనుమతి లేనిదే విడుదల చేయడం కుదరదని పాక్‌ ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ తరుణంలో పాక్‌ రేంజర్‌ బీఎస్ఎఫ్‌కు చిక్కడం గమనార్హం. మరి ఈ విషయంలో భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. బీఎస్ఎఫ్ జవాన్‌ను విడిపించుకోడానికి పాక్ రేంజర్‌ను పావుగా వాడుకునే అవకాశం ఉంది.


మరోవైపు, పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌‌కు వరుస షాక్‌లు ఇస్తూ.. ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు భారత్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లే అన్ని రకాల వస్తు ఎగుమతులను నిలిపివేసి వాణిజ్యపరంగా ఆంక్షలు విధించింది. అదే విధంగా దౌత్య పరంగా పాక్‌ను భారత్ ముప్పు తిప్పలు పెడుతోంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నుంచి వచ్చే రుణాలను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోకి మళ్లీ పాక్ వెళ్లేలా ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌తో సముద్ర రవాణా మార్గాలను మూసివేసిన భారత్.. పాక్ ఓడలను మన జలాల్లోకి రాకుండా, మన ఓడలు పాక్ జలాల్లోకి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa