ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అణుబాంబులకు వెనుకాడం. పాక్ రాయబారి బెదిరింపులు

international |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 09:33 PM

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. భారత్ తమపై ఏక్షణమైనా దాడి చేయొచ్చని.. దీనికి తాము దీటుగా సమాధానం చెబుతామని పాకిస్థాన్‌కు చెందిన మంత్రులు కవ్విస్తున్నారు. తాజాగా, రష్యాలోని పాక్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని, అవసరమైతే అణ్వాయుధాలు కూడా ఉపయోగిస్తామని ప్రగల్భాలు పలికారు. పాక్ భూభాగంపై భారత్ దాడి చేస్తుందనేందుకు తమ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాక్ మంత్రి హానీఫ్ అబ్బాసి కూడా అణ్వాయుధాలతో దాడి చేస్తామని బెదిరింపులకు దిగారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. మరో పాక్ మంత్రి అతుల్లా తరార్ 24 నుంచి 36 గంటల్లో భారత్ దాడి చేయొచ్చని రెండు రోజుల కిందట వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.


రష్యా టెలివిజన్‌తో పాకిస్థాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ మాట్లాడుతూ.. భారత్ దాడి చేసే అవకాశం ఉందని అన్నారు. ‘భారత్ దాడి చేస్తే గట్టిగా బదులిస్తాం... అన్ని ఆయుధాలను ఉపయోగిస్తాం. అవసరమైతే అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తాం’ అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. భారత్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని పిచ్చిప్రేలాపన చేశాడు. సైనిక బలగాల గురించి మాట్లాడకూడదని ఆయన అన్నారు. భారత్‌పై పోరాటానికి పాకిస్థాన్ ప్రజల మద్దతు తమ సైన్యానికి ఉంటుందని ఆయన తెలిపారు. పహల్గామ్ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతోంది.


ఇటీవల పాక్ మంత్రి హానీఫ్ అబ్బాసి. భారతదేశంపై అణ్వాయుధాలతో దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘మా దగ్గర ఘోరి, షాహీన్, గజినీ వంటి క్షిపణులు ఉన్నాయి. 130 అణ్వాయుధ వార్‌హెడ్‌లు భారత్ కోసమే సిద్ధంగా ఉంచాం’ అని ఆయన హెచ్చరించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రొచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.


మరో పాక్ మంత్రి అతుల్లా తరార్ మాట్లాడుతూ.. 24 నుంచి 36 గంటల్లో భారత్ దాడి చేయొచ్చని అన్నారు. ఒకవేళ భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని సైన్యానికి అప్పగించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం వరుసగా పది రోజూ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత పోస్ట్‌లపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపి.. కవ్వింపులకు పాల్పడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa