ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోజే మాపై భారత్ ప్రతీకార దాడి.. పాక్ మాజీ దౌత్యవేత్త సంచలన పోస్ట్

international |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 10:34 PM

జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలో పర్యాటకులపై పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా యుద్ద సన్నాహాలు చేస్తోన్న భారత్.. 54 ఏళ్ల తర్వాత మొదటిసారి సివిల్ మాక్ డ్రిల్‌ను నిర్వహించాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మే 7న జరిగే మాక్ డ్రిల్‌పై ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో పాకిస్థాన్‌పై ప్రతీకార దాడికి ముహూర్తం ఖరారయ్యిందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో భారత్ సైనిక చర్యపై పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా విక్టరీ డే (మే 9) తర్వాత భారత్ దాడిచేసే అవకాశం ఉందన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 10, 11 తేదీల్లో పరిమితి స్థాయిలో భారత్ దాడి చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు అబ్దుల్ బాసిత్ ఎక్స్ (ట్విట్టర్)‌లో పోస్ట్ పెట్టారు.


అంతేకాదు, ‘భారతదేశం నిజంగానే పూర్తి స్థాయి యుద్ధానికి భయపడుతోంది... రెండు ఎంపికలు: పరాక్రమ్ లేదా బాలాకోట్ ప్లస్... పాకిస్తాన్ అన్ని రకాల పరిస్థితులకు సిద్ధంగా ఉంది. కశ్మీర్ వివాదాన్ని కశ్మీరీల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించుకోవడం ద్వారా భారత్ తనకు తానుగా శాశ్వత ఉపకారం చేసుకుంటుంది. వేరే ఆప్షన్ లేదు. బెదిరించే సమయం దాటి చాలా కాలం అయిపోయింది’ అని రెచ్చగొట్టేలా మరో ట్వీట్ చేశాడు. అబ్దుల్ బాసిత్ 2014 నుంచి 2017 వరకు భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించాడు. మరోవైపు, భారత్‌ ప్రతీకార చర్యల భయంతో ఐక్యరాజ్యసమితి శరణు కోరిన పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పహల్గామ్ దాడిలో లష్కరే తొయిబా ఉగ్రవాదుల పాత్ర సహా అనేక ప్రశ్నలు భద్రతా మండలి సంధించడంతో పాక్ నీళ్లునమిలింది.


అటు, ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సల అజిత్ దోవల్ భేటీ అయి.. యుద్ధ సన్నద్దతపై వివరించారు. ఇదే సమయంలో సివిల్ డ్రిల్‌పై వివిధ రాష్ట్రాల సిఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలోని 259 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై వారితో చర్చించారు. ఈ జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1లో 13, కేటగిరీలో 2లో 201, కేటగిరీ 3లో45 జిల్లాలు ఉన్నాయి. కేటగిరీ 1లో 13 జిల్లాలను హై రిస్క్ జోన్‌‌లో ఉన్నాయి. వీటిపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు ఉన్నాయి..







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa