ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్‌లో భారత బిలియనీర్‌ బల్వీందర్ సింగ్ కు ఐదేళ్ల జైలుశిక్ష, దేశ బహిష్కరణ

international |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 10:36 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన భారత బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీ ఓ కేసులో ఇరుక్కుని.. జైలుపాలు అయ్యారు. ముఖ్యంగా మనీలాండరింగ్ కేసులో దోషిగా తేల్చిన దుబాయ్ కోర్టు.. ఈయనకు ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అలాగే కోటి రూపాయల జరిమానా వేసింది. ఇంతటితో ఆగకుండా శిక్ష అనుభవించిన తర్వాత బల్వీందర్ సింగ్ సాహ్నీని దుబాయ్ నుంచి బహిష్కరించాలని తీర్పునిచ్చింది. అసలీ బల్వీందర్ సింగ్ ఎవరు, ఎలా ఈ కేసులో ఇరుక్కున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


బల్వీందర్ సింగ్ సాహ్నీకి ప్రస్తుతం 53 ఏళ్లు ఉంటాయి. చాలా సంవత్సరాల కిందటే రాజ్ సాహ్ని గ్రూప్ పేరుతో ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కంపెనీనీ స్థాపించారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది లాభాలు ఎక్కువ కాగా ఈ కంపెనీనీ విదేశాలకు కూడా విస్తరించారు. ముఖ్యంగా యూఏఈ, అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా బల్వీందర్ సింగ్‌కు దూబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఖరీదైన నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయి. అలాగే ఇతరప్రాంతాల్లోనూ బహుళ అంతస్తుల సముదాయాలు, ఫైవ్ స్టార్ హోటల్స్ వంటివి ఉన్నాయి. దుబాయ్ ఎలైట్ సర్కిల్‌లో అబు సబాహ్‌గా కూడా ఈయనకు మంచి పేరుంది.


అలాగే ఈయనకు ముందు నుంచే లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఈ మక్కువతోనే ఎక్కువగా కార్లు కొనుగోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే 2016లో రోల్స్ రాయిస్ కారు కోసం ఏకంగా 33 మిలియన్ దిర్హామ్‌లతో (భారత కరెన్సీ ప్రకారం రూ.75 కోట్లతో) నంబర్ ప్లేటు కొనుగోలు చేసి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు. ఇదిలా ఉండగా.. బల్వీందర్ సింగ్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు వచ్చాయి. షెల్ కంపెనీలు, ఫోర్జరీ ఇన్‌వాయిసలతో 150 మిలియన్ దిర్హామ్‌లు (భారత కరెన్సీ ప్రకారం రూ.340 కోట్లు) మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.


అయితే 2024లో తొలిసారిగా బల్వీందర్ సహా మరికొంత మంది వ్యక్తులపై కేసులు నమోదు అయ్యాయి. ఇలా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయనను దోషిగా తేల్చింది. బల్వీందర్ సహా మిగతా వారు కూడా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తేల్చుతూ దుబాయ్ ఫోర్త్ క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. ముఖ్యంగా బల్వీందర్ సింగ్ సాహ్నీకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు 5 లక్షల దిర్హామ్‌ల (రూ.1.14 కోట్లు) జరిమానా విధించింది. అలాగే ఆర్థిక బిలియనీర్ నుంచి 150 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని తెలిపింది. ఈ కేసులో శిక్ష పడిన మిగతా వాళ్లలో ఆయన కుమారుడు కూడా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa