ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రతా మండలి ప్రశ్నలతో నీళ్లునమిలిన పాకిస్థాన్‌

international |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 10:40 PM

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోడానికి భారత్ సైన్యం సిద్ధమవుతోన్న వేళ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాకిస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌‌తో కొనసాగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు భద్రతా మండలి నుంచి కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పహల్గామ్ దాడిని ఖండించిన భద్రతా మండలి.. పాకిస్థాన్‌ భూభాగంలోని లష్కరే తొయిబా ఉగ్రసంస్థ పాత్రపై ఆరా తీశాయి. ప్రత్యేకంగా ఓ మతం పర్యాటకులనే చంపడంపై సభ్యదేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాక్ ఇటీవల నిర్వహించిన క్షిపణి పరీక్షలపై కూడా సభ్యదేశాలు విరుచుకుపడ్డాయి. అంతేకాదు, పాకిస్థాన్ నాయకులు చేస్తున్న అణ్వాయుధ హెచ్చరికలు, అణు ముప్పులు కూడా ఉద్రిక్తతలు పెంచే అంశాలుగా సభ్యదేశాలు పేర్కొన్నాయి.


భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశాల్లో ఒకటైన పాకిస్థాన్ ‘సన్నిహిత చర్చలు’ పేరుతో తీసుకొచ్చిన తీర్మానాన్ని సభ్యదేశాలు తిరస్కరించాయి. ఉగ్రదాడిని ఖండించి.. బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉందని గట్టిగా స్పష్టం చేశాయి. పహల్గామ్ దాడిలో మత ఆధారంగా పర్యాటకులను లక్ష్యంగా ఎంచుకున్న అంశాన్ని హైలైట్ చేయడమే కాదు.. పాకిస్థాన్ తరచుగా వినిపించే ‘ఫాల్స్ ఫ్లాగ్’ (దురుద్దేశపూరిత బూటకపు కుట్ర) వాదనను తిరస్కరించాయి. భారత్‌తో సమస్యను ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని తేల్చిచెప్పాయి.


పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత్ తీసుకుంటోన్న చర్యలపై దాయాది చేసిన ఫిర్యాదులను ఐరాస భద్రతా మండలి బుట్టదాఖలు చేసింది. ఎటువంటి తీర్మానం లేకుండానే ఈ రహస్య సమావేశం ముగిసింది. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు అంశాన్ని కూడా పాక్ ప్రస్తావించినా.. ప్రయోజనం లేకపోయింది.


భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఐరాస భద్రతా మండలి నిర్వహించిన ఈ అత్యవసర సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. అయితే, దులో ఎలాంటి తీర్మానం లేకుండా ముగించినా.. ఐరాస కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ, పాక్‌ మాత్రం మరోసారి ఐరాస వేదికను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసింది. పాక్‌ శాశ్వత ప్రతినిధి ఆసిమ్‌ ఇఫ్తిఖర్‌ మాట్లాడుతూ.. భారత్‌పై మరోసారి ఆరోపణలు చేశారు.. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. పహల్గామ్ న ఉగ్రదాడిపై అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు


భారత్, పాకిస్థాన్ మధ్య నెలకున్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని, ఇటీవలి సంవత్సరాల్లో ఇవే అత్యధిక ఉద్రిక్తతలు అని ఆయన పేర్కొన్నారు. అయితే, సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి.. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa