ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత వాయు రక్షణ వ్యవస్థలు పాక్ క్షిపణులు, డ్రోన్లను అడ్డగించినట్లు స్థానికుల కథనం

national |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 09:59 PM

భారతదేశంలోని పదిహేను నగరాలపై ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నం విఫలమైన కొద్ది గంటల వ్యవధిలోనే, జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. ఈ పరిణామంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా జమ్మూ నగరం క్షిపణులు, డ్రోన్ల దాడితో దద్దరిల్లింది.శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జమ్మూ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అత్యవసర సైరన్లు మోగడంతో పాటు నగరం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత వాయు రక్షణ వ్యవస్థలు ఆకాశంలోనే అడ్డగించినట్లు, ఆ సమయంలో కాంతి రేఖలు కనిపించాయని స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన వీడియోల ద్వారా తెలుస్తోంది. జమ్మూతో పాటు 300 కిలోమీటర్ల దూరంలోని కుప్వారా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ పట్టణాలలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసి, బ్లాక్‌అవుట్ ప్రకటించారు. బారాముల్లాలోనూ పూర్తిస్థాయి బ్లాక్‌అవుట్ అమలులో ఉంది.అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సాంబా, అఖ్నూర్, రాజౌరి, రియాసి సెక్టార్లలో పాకిస్థాన్ సైన్యం ఇప్పటికే తీవ్రస్థాయిలో షెల్లింగ్‌కు పాల్పడుతోంది. జమ్మూ విమానాశ్రయంపై కూడా పలు దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం."జమ్మూలో పూర్తి బ్లాక్‌అవుట్. భారీ పేలుళ్లు, బాంబు దాడులు, షెల్లింగ్, లేదా క్షిపణి దాడులని అనుమానిస్తున్నాం. ఆందోళన చెందవద్దు... మాతా వైష్ణో దేవి మనతో ఉంది, అలాగే మన వీర భారత సాయుధ దళాలు కూడా ఉన్నాయి" అని జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa